స్వామియే శరణం అయ్యప్ప: తెరుచుకున్న శబరిమల ఆలయం

  • Published By: vamsi ,Published On : June 14, 2020 / 03:23 AM IST
స్వామియే శరణం అయ్యప్ప: తెరుచుకున్న శబరిమల ఆలయం

శబరిమల ఆలయంలో నెలవారీ పూజలు మరియు ఆచారాల నిమిత్తం ఆలయాన్ని ఇవాళ(14 జూన్ 2020) ఓపెన్ చేశారు. ఐదు రోజుల పాటు ఆలయం తెరిచి ఉంటుందని, అయితే భక్తులకు మాత్రం ఆలయ ప్రవేశాన్ని నిషేధించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది.

కేరళలో కరోనా వ్యాప్తి కాస్తంత తక్కువగా ఉన్నప్పటికీ, కరోనా వ్యాప్తి దృష్ట్యా, భక్తులకు ఆలయంలోకి ప్రవేశం కల్పించకూడదని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు స్పష్టం చేసింది. ఈక్రమంలోనే అయ్యప్ప దర్శనానికి భక్తులు రావద్దంటూ ఆలయ అధికారులు కోరారు.

ఇతర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వస్తే, తిరిగి వైరస్ వ్యాపించే ప్రమాదం ఉందని, ప్రస్తుతానికి భక్తులకు అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. పరిస్థితులను సమీక్షించి, వచ్చే నెలలో ఆలయాన్ని తెరిచే సమయానికి భక్తుల ప్రవేశంపై ఓ నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. స్వామివారికి జరిగే పూజలను శబరిమల పూజారి తంత్ర మహేష్ మోహనారుతో పాటు అర్చకులు ఏకాంతంగా నిర్వహిస్తారు.