చైనాకి శాంసంగ్ బిగ్ షాక్, భారత్‌లో భారీ పెట్టుబడులు, రూ.3లక్షల కోట్ల విలువైన పరికరాల ఉత్పత్తికి ప్రణాళికలు

చైనాకి శాంసంగ్ బిగ్ షాక్, భారత్‌లో భారీ పెట్టుబడులు, రూ.3లక్షల కోట్ల విలువైన పరికరాల ఉత్పత్తికి ప్రణాళికలు

దక్షిణ కొరియాకి చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్, భారత్ లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతోందా? చైనా స్మార్ట్ ఫోన్ ఉత్పత్తిదారులను దెబ్బతీసేలా వ్యూహాలు రచిస్తోందా? భారత్ లో రూ.3లక్షల కోట్ల విలువైన పరికరాల ఉత్పత్తికి ప్రణాళికలు రెడీ చేసిందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. శాంసంగ్ తన స్మార్ట్ ఫోన్ ఉత్పత్తిలో కొంత భాగాన్ని ఇతర దేశాల నుండి భారత్ కి తరలించేందుకు యోచిస్తోంది. భారత్ లో 50 బిలియన్ డాలర్లు అంటే 3 లక్షల కోట్ల విలువైన పరికరాలను ఉత్పత్తి చేయాలని యోచిస్తోంది.



చైనా స్మార్ట్ ఫోన్ ఉత్పత్తిదారులను దెబ్బతీసేలా ప్రణాళిక:
ముఖ్యంగా చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ భారత్ లో ఊపందుకున్న నేపథ్యంలో చైనా స్మార్ట్ ఫోన్ ఉత్పత్తిదారులను దెబ్బతీసేలా శాంసంగ్ వ్యూహాలు రచిస్తోంది. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్(పీఎల్‌ఐ)పథకం కింద స్మార్ట్‌ఫోన్ల ఉత్పత్తిని మరింత విస్తృతం చేయనుంది. ఈ మేరకు ఒక అంచనాను కూడా ప్రభుత్వానికి సమర్పించింది.



దేశంలో 3.7లక్షల కోట్ల విలువైన పరికరాల ఉత్పత్తి:
స్మార్ట్ ఫోన్ ఉత్పత్తికి సంబంధించి వియత్నాం సహా ఇతర దేశాల నుండి తన పెట్టుబడులను భారత్ వైపు మళ్ళించనుంది శాంసంగ్. మన దేశంలో 50 బిలియన్ డాలర్లు లేదా 3.7 లక్షల కోట్ల రూపాయల విలువైన పరికరాలను ఉత్పత్తి చేయాలని ప్రణాళికలను రచిస్తోంది. ముఖ్యంగా రానున్న ఐదేళ్లలో 15వేల రూపాయల కంటే తక్కువ ధర ఫోన్‌లను ఉత్పత్తి చేయనుంది.



భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ కంపెనీలు ఆసక్తి:
పీఎల్‌ఐ పథకానికి దేశీయ, అంతర్జాతీయ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ తయారీదారుల నుంచి భారీ ఆదరణ లభించిందని కమ్యూనికేషన్స్, ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇటీవల ప్రకటించారు. మొత్తం 22 కంపెనీలు ముందుకు వచ్చాయని వెల్లడించారు. అంతర్జాతీయ తయారీ సంస్థలు ఆపిల్, శాంసంగ్ తో పాటు దేశీయంగా లావా, మైక్రోమాక్స్, ప్యాడ్జెట్ ఎలక్ట్రానిక్స్, సోజో కంపెనీలు ముందుకురావడం సంతోషదాయకమన్నారు.



దక్షిణ కొరియాలో భారీగా కార్మిక ఖర్చులు:
గ్లోబల్ స్మార్ట్ ఫోన్ ఎగుమతి మార్కెట్ 270 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. వీటిలో ఆపిల్ 38 శాతం మార్కెట్ వాటా కాగా శాంసంగ్ వాటా 22 శాతం. వాల్యూమ్ విషయానికి వస్తే శాంసంగ్‌ 20 శాతం సొంతం చేసుకోగా, ఆపిల్‌ వాటా 14 శాతం. కాగా శాంసంగ్ తన ఫోన్లలో దాదాపు 50 శాతం వియత్నాంలో ఉత్పత్తి చేస్తుంది. దక్షిణ కొరియాలో కార్మిక ఖర్చులు భారీగా ఉండంటంతో దేశంలో తయారీని దాదాపు మూసివేసే ప్రక్రియలో ఉంది. వియత్నాంతో పాటు బ్రెజిల్, ఇండోనేషియాలో కూడా శాంసంగ్ ప్రొడక్షన్ యూనిట్లు ఉన్నాయి.



రానున్న ఐదేళ్లలో భారత్ లో రూ.11లక్షల కోట్ల విలువైన మొబైల్ ఫోన్ల ఉత్పత్తి:
రానున్న ఐదేళ్లలో మన దేశంలో 11లక్షల కోట్ల విలువైన మొబైల్ ఫోన్లు ఉత్పత్తి అవుతాయని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. పీఎల్ఐ స్కీమ్ కింద మొబైల్ తయారీ కంపెనీలు భారత్ లో ప్రొడక్షన్ ను రూ.27.5లక్షల కోట్లకు పెంచుతాయని ఇండియా సెల్యూలార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్(ICEA) అంచనా వేసింది. దేశంలో ప్రస్తుతం ఏడాదికి రూ.2లక్షల కోట్ల ఫోన్ల ఉత్పత్తి జరుగుతోంది. దీని ద్వారా 5 నుంచి 6లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. 2025 నాటికి మన దేశంలో ఫోన్ల తయారీ పరిశ్రమలో ఒక లక్ష కోట్ల పెట్టుబడులు రాబట్టాలని, మ్యానుఫ్యాక్చరింగ్ ఆదాయాన్ని రూ.10లక్షల కోట్లకు పెంచాలని కేంద్రం ఆశిస్తోంది.



యూపీలో ప్రపంచ అతిపెద్ద మొబైల్ ఫోన్ ఫ్యాక్టరీ:
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మేక్ ఇన్ ఇండియా పిలుపుతో శాంసంగ్ స్ఫూర్తి పొందింది. అందుకే భారత్ లో పెట్టుబడులు పెట్టి ఇక్కడే ప్రొడక్షన్ చేయాలని చూస్తోంది. ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్ లో ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఫోన్ ఫ్యాక్టరీని శాంసంగ్ నెలకొల్పింది. ఇందులో 12 కోట్ల యూనిట్లను ఉత్పత్తి చేస్తారు. ఐసీఈఏ ప్రకారం భారత్ లో మొబైల్ ఫోన్ మార్కెట్ విలువ 2లక్షల కోట్లు దాటింది.