విద్యార్థులకు సంస్కృత శ్లోకాలు నేర్పితే అత్యాచారాలు ఆగిపోతాయ్ : మహా గవర్నర్ వ్యాఖ్యలు
విద్యార్థులకు సంస్కృత శ్లోకాలు నేర్పితే మహిళలపై అత్యాచారాలు జరగవని మహారాష్ట్ర గవర్నర్ భగత్సింగ్ కోషియారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రతీరోజూ ఏదోక ప్రాంతంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయనీ అత్యాచారాలు ఆగాలంటే విద్యార్ధి దశ నుంచి సంస్కృత శ్లోకాలను వారికి నేర్పితే అఘాయిత్యాలు ఆగిపోతాయని వ్యాఖ్యానించారు. గురువారం (డిసెంబర్ 19) నాగపూర్ యూనివర్శిటీలో జమ్నాలాల్ బజాజ్ పరిపాలనా భవనాన్ని ప్రారంభించిన అనంతర గవర్నర్ మాట్లాడుతూ..ఈ వ్యాఖ్యలు చేశారు.
విద్యార్ధులు సంస్కృత శ్లోకాలు నేర్చుకుంటే మంచి చెడుల విచక్షణ తెలుస్తుందని వాటిపై అవగాహన పెరుగుతుందని అన్నారు. అలా విచక్షణ కలిగితే ఆటోమేటిగా మహిళలపై అత్యాచారాలు ఆగిపోతాయని అన్నారు. బజాజ్ ఎలక్ట్రికల్స్ ఎండీ శేఖర్ బజాజ్ ను ఉద్ధేశించి గవర్నరు మాట్లాడుతూ..అందరూ కన్యా పూజలు ఇళ్లలో చేస్తుంటారు, మీరు కూడా సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చినవారే..మీరు కూడా కన్యాపూజ చేసే ఉంటారు..కాని ప్రస్థుతం కొంతమంది దుర్మార్గులు మహిళలపై అత్యాచారాలు చేసి వారిని చంపేస్తున్నారు…విద్యార్థులకు సంస్కృత శ్లోకాలు నేర్పితే వారు ఇలాంటి దారుణ అత్యాచారాలకు పాల్పడరు అని కోషియారీ వ్యాఖ్యానించారు.
కాగా..యూనివర్శిటీలోని ఎడ్మినిస్ట్రేటివ్ భవనానికి కార్పొరేట్ సామాజిక బాధ్యతగా బజాజ్ గ్రూప్ చైర్మన్ రాహుల్ బజాజ్ రూ.10 కోట్లు ఇచ్చారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ..ఒక వ్యాపార వేత్త విద్యకు సహాయపడటం అనేది చాలా సంతోషించాల్సిన విషయం అని అన్నారు.