రాహుల్ పౌరసత్వంపై పిటిషన్..విచారణకు అంగీకరించిన సుప్రీం
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పౌరసత్వంపై దాఖలైన పిటిషన్ ను విచారించేందుకు గురువారం(మే-2,2019) సుప్రీంకోర్టు అంగీకరించింది.వచ్చే వారం రాహుల్ పౌరసత్వంపై సుప్రీంలో విచారణ జరగనుంది. రాహుల్ కు బ్రిటన్ పౌరసత్వం ఉందని,ఆయన్నుఎన్నికల్లో పోటీ చేయకుండా డీబార్ చేసేలా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలివ్వాలంటూ సుప్రీంలో పిటిషన్ దాఖలైంది.కావాలనే బ్రిటన్ పౌరసత్వం తీసుకున్న వ్యక్తిని.. భారత పార్లమెంట్కు ఎంపిక చేసే అవకాశం ఉంటుందా లేదా అని పిటిషన్ లో ప్రశ్నించారు.ఢిల్లీకి చెందిన జై భగవాన్ గోయల్, చందర్ ప్రకాశ్ త్యాగీలు ఈ పిటిషన్ వేశారు.
ప్రజాస్వామ్య వ్యవస్థల క్షేమం కోసం పిటిషన్ దారులు పోరాటం చేశారని, వారి అభ్యర్థనను స్వీకరిస్తున్నట్లు సీజేఐ రంజన్ గగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది.పౌరసత్వ వివాదంపై 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని రాహుల్ గాంధీకి ఇప్పటికే హోంశాఖ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే.