రామజన్మభూమిపై వెనక్కి తగ్గిన సున్నీ వక్ఫ్ బోర్డు

  • Published By: chvmurthy ,Published On : November 27, 2019 / 02:16 AM IST
రామజన్మభూమిపై వెనక్కి తగ్గిన సున్నీ వక్ఫ్ బోర్డు

అయోధ్య రామజన్మభూమి వివాదాస్పద కేసులో సుప్రీంకోర్టు తీర్పుని సవాల్ చేయకూడదని సున్నీ వక్ఫ్ బోర్డ్ నిర్ణయించుకుంది. లక్నోలో భేటీ అయిన బోర్డు ప్రతినిధులు.. ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. అయితే.. ముస్లిం పర్సనల్‌ లా బోర్డు మాత్రం.. అయోధ్యపై రివ్యూ పిటిషన్ వేస్తామనే చెబుతోంది.

అయోధ్య వివాదాన్ని ఇక పొడిగించకూడదన్న నిర్ణయానికే కట్టుబడింది ఈ కేసులో ప్రధాన కక్షిదారైన సున్నీ వక్ఫ్ బోర్డ్. అయోధ్యలోని వివాదాస్పద స్థలం రామన్యాస్ ట్రస్ట్‌కే చెందేలా సుప్రీంబెంచ్ తీర్పు ఇవ్వగా.. దీనిపై రివ్యూ కోరాలా లేదా అన్నదానిపై లక్నోలో సమావేశమైన సున్నీ వక్ఫ్‌ బోర్డ్ సుదీర్ఘంగా చర్చించింది. బోర్డులోని ఆరుగురు సభ్యులు సమీక్షకు వెళ్లకూడదని అభిప్రాయ పడగా.. ఒక్కరు మాత్రం సమీక్షకు వెళ్లాల్సిందేనని పట్టుబడ్డారు. మెజార్టీ సభ్యుల నిర్ణయం మేరకు.. ఈ కేసుకు ఇక్కడితే పుల్‌స్టాప్‌ పెట్టాలని డిసైడ్‌ అయ్యింది.

దశాబ్దాలకు దశాబ్దాలు నడిచిన బాబ్రీమసీద్ రామ జన్మభూమి కేసు..ఇక వివాదం చేయడం వలన ఎలాంటి లాభం లేదని..ఇప్పటికే అన్ని వర్గాలు ప్రశాంతంగా ఉన్నందునరివ్యూ పిటీషన్ వేసి అనవసరంగా ఒంటరి కావడం ఎందుకని కూడా లక్నో భేటీలో ప్రశ్నలు విన్పించాయ్..అందుకే రామాలయనిర్మాణానికి సహకరించడమే సరైన విధానమని వక్ఫ్ బోర్డ్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు మాత్రం.. ఈ కేసులో రివ్యూ పిటిషన్ వేస్తామనే చెబుతోంది. దీనికి వ్యతిరేకంగా వందమంది ముస్లిం సెలబ్రిటీలు ఓ ఉద్యమాన్ని కూడా మొదలుపెట్టారు.