Anti-Covid Drug 2-DG : కరోనా బాధితులకు గుడ్ న్యూస్, నేడే 2-DG డ్రగ్ సెకండ్ బ్యాచ్ విడుదల
కరోనా విరుగుడుగా దేశీయంగా తయారు చేసిన 2-DG డ్రగ్ నేడు(మే 27,2021) మార్కెట్ లోకి విడుదల అవుతోంది. యాంటీ కోవిడ్ డ్రగ్ 2డీజీ సెకండ్ బ్యాచ్ ను డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ విడుదల చేయనుంది. కరోనా బాధితులపై ఇది ప్రభావవంతంగా పని చేస్తున్నట్లు తేలింది.
Anti-Covid Drug 2-DG : కరోనా విరుగుడుగా దేశీయంగా తయారు చేసిన 2-DG డ్రగ్ నేడు(మే 27,2021) మార్కెట్ లోకి విడుదల అవుతోంది. యాంటీ కోవిడ్ డ్రగ్ 2డీజీ సెకండ్ బ్యాచ్ ను డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ విడుదల చేయనుంది. కరోనా బాధితులపై ఇది ప్రభావవంతంగా పని చేస్తున్నట్లు తేలింది. దీని పనితీరుపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ రోజు మార్కెట్ లోకి 10వేల సాచెట్లను విడుదల చేస్తున్నారు. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ దీన్ని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తోంది. జూన్ మొదటి వారంలో పూర్తి స్థాయిలో ఈ డ్రగ్ అందుబాటులోకి రానుంది.
కరోనాపై పోరుకు డీఆర్డీవో అభివృద్ధి చేసిన యాంటీ కొవిడ్ డ్రగ్ 2-డియాక్సీ డి-గ్లూకోజ్(2డీజీ). పొడి రూపంలో ఉండే ఈ ఔషధాన్ని నీటితో కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల.. వైరస్ ఉన్న కణాల్లోకి చేరి, దాని వృద్ధిని అడ్డుకుంటుందని డీఆర్డీవో వివరించింది. కరోనా కట్టడికి ఇప్పటివరకు వ్యాక్సిన్లను మాత్రమే ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఈ పొడిని తయారు చేసింది. కరోనా రోగుల ఎమర్జెన్సీ వాడకానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి ఇచ్చింది.
డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ సహకారంతో డీఆర్డీఓకు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ (INMAS) ఈ డ్రగ్ను అభివృద్ధి చేసింది. ఓ మోస్తరు నుంచి తీవ్రమైన కొవిడ్ లక్షణాలున్న వారిలో ఇది సమర్థంగా పనిచేస్తున్నట్లు క్లినికల్ ట్రయల్స్లో వెల్లడైంది. తెలంగాణలో ఈ 2డీజీ ఔషధం జూన్ మొదటి వారంలో అందుబాటులోకి వస్తుంది. కరోనా బాధితులకు ప్రధాన చికిత్స చేస్తూ అదనంగా ఈ డ్రగ్ను ఇస్తే వారు వేగంగా కోలుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ ఆధారంగా మాత్రమే వినియోగదారులకు ఈ డ్రగ్ ఇస్తారు. 2డీజీ డ్రగ్ మొదటి బ్యాచ్ను మే 17 న రక్షణ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన విషయం తెలిసిందే.