Covid india Update: మే మూడో వారంలో కరోనా విశ్వరూపం : SBI report
మే నెల మూడో వారంలో దేశంలో కరోనా సెకండ్ వేవ్ మరింత ఉద్ధృతం
COVID-19 second wave మే నెల మూడో వారంలో దేశంలో కరోనా సెకండ్ వేవ్ మరింత ఉద్ధృతం కానుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తాజా అధ్యయనం సూచించింది. ఎస్బీఐ తాజా రిపోర్ట్ ప్రకారం..ప్రపంచ వ్యాప్తంగా రికవరీ రేట్లు మెరుగుపడుతుంటే భారత్ లో మాత్రం రికవరీ రేటు తగ్గుతూ ఉంది. ఫిబ్రవరి మధ్యలో భారత్ లో రికవరీ రేటు 97.3 శాతానికి చేరింది. అయితే అప్పటి నుంచీ సెకండ్ వేవ్ మొదలు కావడంతో క్రమంగా తగ్గుతూ తాజాగా 85 శాతానికి చేరింది. ఈ రికవరీ రేటు 78-79 శాతానికి చేరినప్పుడు కరోనా సెకండ్ వేవ్ పీక్ స్టేజ్కు చేరుతుందని ఎస్బీఐ అంచనా వేసింది.
ఫిబ్రవరి- 15 నుంచి పీక్ టైమ్ను 96 రోజులుగా అంచనా వేసినట్లు ఎస్బీఐ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ డాక్టర్ సౌమ్య కాంతి ఘోష్ తెలిపారు. ఆ లెక్కన మే మూడో వారంలో సెకండ్ వేవ్ పీక్ స్టేజ్కు చేరనుందని కాంతి ఘోష్ చెప్పారు. ప్రస్తుతానికి రోజువారీ కేసులను పరిశీలిస్తే ముందు రోజు కంటే కనీసం 15 వేల కేసులు ఎక్కువగా వస్తున్నాయి.
ఫస్ట్ కోవిడ్ వేవ్ లో నేషనల్ పీక్ కంటే ముందే ఉత్తరప్రదేశ్,మహారాష్ట్ర పీక్ స్టేజీకి చేరుకున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో కొత్త కేసుల సంఖ్య ఓ స్థాయికి చేరి అక్కడే స్థిరంగా ఉండిపోయింది. మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో ప్రస్తుత సెకండ్ వేవ్ లో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయి..రోజువారీ కొత్త కేసులు పెరుగుతున్నాయి. ఇతర రాష్ట్రాలు కూడా కఠిన ఆంక్షలు అమలుచేస్తూ..వైరస్ వ్యాప్తిని నిలువరిస్తే అప్పుడు మహారాష్ట్ర పీక్ చేరకున్న 2వారాల తర్వాత ఈ రాష్ట్రాల్లో కూడా కేసుల సంఖ్య గరిష్ఠానికి తాకి అక్కడే స్థిరంగా ఉండే అవకావం ఉన్నట్లు ఎస్బీఐ రిపోర్ట్ వెల్లడించింది. ఇక ప్రస్తుత పరిస్థితులను బట్టి ఈ ఆర్థిక సంవత్సరంలో ఇండియా వాస్తవిక జీడీపీ 10.4 శాతంగా ఉండనున్నట్లు ఎస్బీఐ అంచనా వేసింది. కాగా, రోజుకు కరోనా కేసులు మూడు లక్షలకు వరకూ చేరవచ్చని గతంలోనే ఎస్బీఐ అంచనా వేసింది. అందుకు తగినట్లే ఇప్పుడు కేసులు అంతకు మించి నమోదవుతున్నాయి.