Mamata Banerjee : కరోనా “సెకండ్ వేవ్” మోడీ సృష్టించిన విపత్తే
దేశంలో కరోనా వైరస్ రెండో దశలో తీవ్రంగా వ్యాప్తిస్తున్న తరుణంలో వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధాన మంత్రి నరేంద్రమోడీపై మరోసారి ధ్వజమెత్తారు.
Second COVID wave దేశంలో కరోనా వైరస్ రెండో దశలో తీవ్రంగా వ్యాప్తిస్తున్న తరుణంలో వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధాన మంత్రి నరేంద్రమోడీపై మరోసారి ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా దక్షిణ దినాజ్పూర్ జిల్లాలోని బాలూర్ఘాట్లో టీఎంసీ ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడిన మమతా బెనర్జీ..ప్రధానిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విజృంభించడానికి ప్రధాని నరేంద్రమోడీయే కారణమని ఆరోపించారు. కరోనా సెకండ్ వేవ్ను మోడీ సృష్టించిన విపత్తుగా అభివర్ణించారు.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా ఉన్నది. నేను దీన్ని మోడీ సృష్టించిన విపత్తే అంటాను. హాస్పిటల్స్ లో సరిపడా ఇంజెక్షన్లు లేవు. ఆక్సిజన్కూ కొరత ఉంది. దేశంలో ఇలాంటి విపత్కర పరిస్థితులు ఉన్నా కరోనా టీకాలను, ఔషధాలను మాత్రం విదేశాలకు తరలించారని మమతా బెనర్జీ విమర్శించారు. రాష్ట్రంలో మళ్లీ బెంగాల్ ఇంజిన్ ప్రభుత్వమే ఏర్పాటవుతుందని, మోడీ డబుల్ ఇంజిన్ గవర్నమెంటుకు అవకాశమే ఉండదన్నారు. ఈ ఎన్నికలు పశ్చిమ బెంగాల్, బెంగాల్ మాత గౌరవాన్ని కాపాడటానికి చేసే పోరాటంగా ఆమె అభివర్ణించారు. రాష్ట్రానికి తాను కాపలాదారుడిగా వ్యవహరిస్తానంటూ ప్రజలకు భరోసా ఇచ్చారు. దక్షిణ దినాజ్పూర్ జిల్లాలో గత పదేళ్లలో టీఎంసీ ప్రభుత్వం రోడ్లు, ఆస్పత్రులు, వంతెనలు, స్టేడియాలతోపాటు పారిశ్రామిక కేంద్రాన్ని నిర్మించిందని ఈ సందర్భంగా బెనర్జీ చెప్పారు.
కాగా 294 మంది సభ్యుల రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వరకు ఎనిమిది దశల్లో జరుగుతున్నాయి. ఇప్పటికే ఐదు విడతల్లో 180 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. మిగిలిన 114 సీట్లకు మూడు దశల్లో ఏప్రిల్ 22 నుంచి 29 వరకు ఎన్నికలు జరగనున్నాయి. మే 2న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.