రెండో జకీర్ నాయక్ లా తయారవుతున్నాడు

  • Published By: chvmurthy ,Published On : November 16, 2019 / 03:42 PM IST
రెండో జకీర్ నాయక్ లా తయారవుతున్నాడు

హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ రెండో జకీర్ నాయక్ లా తయారవుతున్నాడని కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో ఆరోపించారు. ఇస్లాం బోధకుడు, జకీర్ నాయక్ పై రెచ్చగొట్టే వ్యాఖ్యలతో విద్వేషాన్ని వ్యాపింపచేయడం, ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చడం వంటి పలు ఆరోపణలున్నాయి.

అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన తర్వాత  ఒవైసీ “నా మసీదు నాకు తిరిగి కావాలి” అని శుక్రవారం ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ను చూసి కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.  దశాబ్దాలుగా ఉన్న వివాదానికి ముగింపు పలుకుతూ సుప్రీం కోర్టు నవంబర్ 6న రామాలయాన్నినిర్మించటానికి  ట్రస్ట్ ఏర్పాటు చేయాలని, మసీదుకు5 ఎకరాల భూమి ఇవ్వాలని ఆదేశిస్తూ తీర్పు చెప్పింది. 

ఆయన అతిగా మాట్లాడితే చట్టం తన పని తాను చేసుకువెళుతుందని సుప్రియో అన్నారు. కాగా, అయోధ్య తీర్పు తర్వాత ఒవైసీ …. తమ పోరాటం భూమి కోసం కాదని, తమ న్యాయపరమైన హక్కులు దక్కడం కోసమేనని వ్యాఖ్యానించారు. మసీదును నిర్మించేందుకు ఏ ఆలయాన్ని కూల్చలేదని సుప్రీం కోర్టు స్పష్టంగా చెప్పిందని..మసీదును మాకు తిరిగివ్వాలని తాము కోరుకుంటున్నామని కూడా ఇటీవల ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అసదుద్దీన్‌ పేర్కొన్నారు.