కుప్పకూలిన స్టాక్ మార్కెట్, ప్రభావం చూపిన అంశాలు

కుప్పకూలిన స్టాక్ మార్కెట్, ప్రభావం చూపిన అంశాలు

Sensex, Nifty Bank Down : వారం క్రితం 50వేల పాయింట్లు దాటి సరికొత్త చరిత్ర సృష్టించిన సెన్సెక్స్‌ నాలుగు రోజుల నుంచీ భారీ నష్టాలు నమోదు చేస్తోంది. 2021, జనవరి 27వ తేదీ బుధవారం 700 పాయింట్లకు పైగా కోల్పోయి 48వేల దిగువకు పడిపోయింది. బుధవారం ఉదయం 48వేల 385 పాయింట్ల దగ్గర ప్రారంభమైన సెన్సెక్స్‌ ఒక దశలో 752 పాయింట్లకు పైగా నష్టపోయి 47వేల 738 పాయింట్ల కనిష్టస్థాయిని నమోదు చేసింది. మెటల్, ఫార్మా, బ్యాంకింగ్ రంగ షేర్లన్నీ నష్టాల్లో సాగుతున్నాయి.

రేపటి ఆప్షన్ కాంట్రాక్టులు, జనవరి నెల ముగింపుకు వస్తుండడం వంటి కారణాలతో మార్కెట్ అమ్మకాల ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. నిఫ్టీ కూడా నష్టాల్లోనే సాగుతోంది. 14వేల వంద పాయింట్ల దిగువకు పడిపోయింది. నాలుగు రోజుల్లో రెండు వేల పాయింట్లకు పైగా నష్టపోయింది సెన్సెక్స్. బడ్జెట్ ముందు సాధారణంగా ఉండే ఆందోళనలు, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం, విదేశీ పెట్టుబడిదారులు అమ్మకాలకు ఆసక్తి చూపడం, అంతర్జాతీయంగా జీడీపీ వృద్ధిరేటు పెరుగుతోందన్న అంచనాలు, ఆసియా మార్కెట్ల మిశ్రమ స్పందన, కరోనా కొత్త స్ట్రెయిన్‌ బాధితులు కోలుకోవడానికి సమయం పడుతోందన్న వార్తలు, అమెరికా కొత్త అధ్యక్షుడు ప్రకటించిన 1.9 ట్రిలియన్‌ డాలర్ల కరోనా ఉపశమన ఉద్దీపన పథకం అమలు ఆలస్యం కానుండడం లాంటి కారణాలు మార్కెట్లపై ప్రభావం చూపాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు.