రూ. 225కే కరోనా వ్యాక్సిన్…10 కోట్ల డోసులను రెడీ చేస్తున్న సీరం ఇన్‌స్టిట్యూట్

  • Published By: venkaiahnaidu ,Published On : August 7, 2020 / 06:39 PM IST
రూ. 225కే కరోనా వ్యాక్సిన్…10 కోట్ల డోసులను రెడీ చేస్తున్న సీరం ఇన్‌స్టిట్యూట్

అతితక్కువ ధరలో కోవిడ్-19 వాక్సీన్ అందుబాటులోకి తెచ్చేందుకు పూణేకు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్​ ఇండియా (ఎస్‌ఐఐ) కీలక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. గవి (ది వ్యాక్సిన్ అలయన్స్), బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్‌తో ఈ డీల్ కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం… వ్యాక్సిన్ తయారీ కోసం గేట్స్ ఫౌండేషన్ నుండి గవి ద్వారా 150 మిలియన్ డాలర్ల నిధులు సీరంకు అందుతాయి.

ప్రధానంగా ఇండియాలో కరోనా కేసుల ఉధృతి పెరుగుతున్న తరుణంలో 10 కోట్ల మోతాదుల కరోనా వైరస్ వాక్సీన్లను తయారీ చేయనున్నామని ఎస్‌ఐఐ శుక్రవారం ప్రకటించింది. ఈ మేరకు డీల్‌పై సంతకాలు చేసినట్టు తెలిపింది. ఈ వ్యాక్సిన్ ఒక్కో డోస్ ధర గరిష్టంగా 3 డాలర్లు (225 రూపాయలు) ఉంటుందని, వీటిని 92 దేశాల్లో గవికి చెందిన కోవ్యాక్స్ అడ్వాన్స్ మార్కెట్ కమిట్‌మెంట్(ఏఎంసీ)లో అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపింది.

2021 చివరి నాటికి కోట్లాది వాక్సిన్లను అందించాలనేది ప్రధాన లక్ష్యమని ఒక ప్రకటనలో తెలిపింది. బిల్‌గేట్స్, గేట్స్‌ ఫౌండేషన్‌, గావిసేత్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఎస్‌ఐఐ సీఈఓ అధమ్ పూనావల్లా ట్వీట్ చేశారు. 2021నాటికి అతి తక్కువ ధరలో ప్రపంచంలోని వెనుకబడిన దేశాలకు వ్యాక్సిన్‌ పంపిణీని వేగవంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని అయన తెలిపారు. వాక్సీన్ల ప్రాప్యత విషయంలో చాలా వెనుక బడిన దేశాలు ఇబ్బందులు పడటం గతంలో చూశామని గవి సీఈఓ డాక్టర్ సేథ్ బెర్క్ లీ చెప్పారు.

కాగా ఎస్‌ఐఐ సంస్థతో తమవాక్సిన్ సరఫరా, లైసెన్స్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు నోవావాక్స్ ఈ వారంలో ప్రకటించింది. ఆక్స్‌ఫర్డ్‌ ఆస్ట్రాజెనెకాతో తయారీ ఒప్పందాలను ఎస్‌ఐఐ ఇప్పటికే కుదుర్చుకుంది. అటు దేశంలో చివరి దశ మానవ పరీక్షలకు ఆక్స్‌ఫర్డ్‌ ఆస్ట్రాజెనెకా టీకాకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి లభించిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం దేశంలో సుమారు 20 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే, భారతదేశంలో మొత్తం కేసుల్లో 38 శాతం కేవలం ఐదు రాష్ట్రాల నుంచే నమోదయ్యాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్ ఉన్నాయి. జూలై 16 తరువాత, దేశంలో వైరస్ వ్యాప్తి చెందే విధానంలో చాలా మార్పులు వచ్చాయి. జూలై 16 వరకు దేశంలో 10 లక్షల కరోనా కేసులు నమోదవగా.. అప్పుడు ఈ రాష్ట్రాల నుంచి 19 శాతం కేసులు నమోదయ్యాయి.

జూలై 16 నాటికి, భారతదేశంలో మొత్తం కేసులు 10 లక్షలను దాటినప్పుడు, ఈ కేసులలో 55% మూడు రాష్ట్రాల నుండి నమోదయ్యాయి. ఈ మొత్తం కేసులలో 28.3% కేసులు మహారాష్ట్ర నుండి మాత్రమే వచ్చాయి (2,84,281 కేసులు). తరువాత తమిళనాడు (1,56,369 కేసులు) 15.6%, ఢిల్లీ (118,645 కేసులు) 11.8% ఉన్నాయి.