Shopian లో టెన్షన్ : జైష్ – ఎ – మహ్మద్ ఉగ్రవాది హతం

  • Published By: madhu ,Published On : February 27, 2019 / 02:35 AM IST
Shopian లో టెన్షన్ : జైష్ – ఎ – మహ్మద్ ఉగ్రవాది హతం

షోపియాన్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. షోపియాన్‌లో ఫిబ్రవరి 27వ తేదీ బుధవారం ఉదయం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పులను భారత బలగాలు తిప్పికొట్టాయి. సైనికులు జరిపిన కాల్పుల్లో జైష్ – ఎ – మహ్మద్ ఉగ్రవాది హతమయ్యాడు. మరో ఇద్దరు ఉగ్రవాదులను భారత బలగాలు నిర్భందించాయి. ఇరువర్గాల మధ్య కాల్పులతో ఆ ప్రాంతం దద్దరిల్లుతోంది. ఫుల్ టెన్షన్ వాతావరణం నెలకొంది. 

దక్షిణ కాశ్మీర్ అంటే ఉగ్రవాదులకు అడ్డాగా మారిపోయింది. ఎంతోమంది ఉగ్రవాదులను మట్టుబెట్టినా మరికొంతమంది ఎక్కడో ఒక చోట నక్కి ఉంటున్నారు. గత కొన్ని రోజులుగా పాక్ – భారత్ దేశాల మధ్య ఉద్రిక్త పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. బాల్కోట్ జిల్లాలోకి భారత బలగాలు ప్రవేశించి ఉగ్రవాదులను హతమార్చారు. మరికొన్ని దాడులు జరిగే అవకాశాలున్నాయని ఐబీ హెచ్చరించిన నేపథ్యంలో భారత బలగాలు అలర్ట్ అయ్యాయి. సరిహద్దు వెంబడి భారీగా సైనికులు మోహరించారు. ఉగ్రవాదులను ఏరివేసేందుకు సైనికులు ప్రయత్నిస్తున్నారు. షోపియాన్ కాల్పులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.