దేవెగౌడ ఎవ్వరినీ ఎదగనివ్వడు…సిద్దూ సంచలన వ్యాఖ్య లు

  • Published By: venkaiahnaidu ,Published On : August 23, 2019 / 11:11 AM IST
దేవెగౌడ ఎవ్వరినీ ఎదగనివ్వడు…సిద్దూ సంచలన వ్యాఖ్య లు

మొన్నటివరకు కర్ణాటకలో సంకీర్ణ సర్కార్ నడిపిన కాంగ్రెస్-జేడీఎస్ ల మధ్య మరోసారి విబేధాలు భగ్గుమన్నాయి. ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. మూడు నెలల క్రితం జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తాను,దేవెగౌడ కలిసి చాలా నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించామని, కానీ మండ్యాలో తన మనువడు నిఖిల్ గౌడ ఓటమికి తనను దేవెగౌడ తిట్టాడని మాజీ సీఎం,కాంగ్రెస్ సీఎల్పీ నాయకుడు సిద్దరామయ్య అన్నారు. దేవెగౌడ కుటుంబంలా తాను రాజకీయాలు చేయలేదని సిద్దూ అన్నారు.

తమ పార్టీ  నాయకులు కూడా ఓడియారని,దీనికి దేవెగౌడ ఏం చెప్తారని సిద్దూ ప్రశ్నించారు. దీని వెనక కారణమేంటన్నారు. తమకు వ్యతిరేకంగా ఓటు వేసినవారిపై ఏమైనా చర్యలు తీసుకున్నారా అని సిద్దూ ప్రశ్నించారు. దేవెగౌడ ఎప్పుడూ కూడా ఎవ్వరినీ ఎదగనివ్వలేదన్నారు. తమ కులానికి చెందిన వారిని కూడా ఎదగనివ్వలేదని అన్నారు. తనకు అన్ని పార్టీల్లో,అన్నీ కులాల్లో స్నేహితులు ఉన్నారన్నారు.

అంతకుముందు సిద్దరామయ్యే సంకీర్ణ సర్కార్ కూలిపోవడానికి కారణమని దేవెగౌడ ఆరోపించారు. తన కొడుకు సీఎంగా ఉండటం సిద్దరామయ్యకు ఇష్టం లేదని, అందుకే యడియూరప్పను సీఎం చేయడం కోసం సంకీర్ణ సర్కార్ ని సిద్దూ కూల్చాడని దేవెగౌడ ఆరోపించారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో  మండ్య నుంచి పోటీ చేసిన కుమారస్వామి కొడుకు,తుముకూరు నుంచి పోటీ చేసిన దేవెగౌడ ఓడిపోయిన విషయం తెలిసిందే.