Single Use Plastic : జులై 1నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం
జూలై1వ తేదీ నుంచి భారత దేశంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Single Use Plastic : జూలై1వ తేదీ నుంచి భారత దేశంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్లాస్టిక్ కాలుష్యంలో అన్నిటికన్నా ముందుండేది ప్రతి రోజు మనం ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్ వస్తువులే. వాటిలో ప్లాస్టిక్ గ్లాసు.. తినిపడేసే ప్లాస్టిక్ ప్లేటు ఇలాంటి వన్నీ రీసైకిల్ కాకుండా కొన్ని వందల ఏళ్ల వరకు భూమిపై అలానే ఉండిపోతాయి.
ఇప్పటికే సుమారు 77 దేశాల్లో పూర్తిగాను, మరికొన్ని దేశాల్లో పాక్షికంగానూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం విధించారు. కొన్నిలెక్కల ప్రకారం ప్లాస్టిక్ వ్యర్ధాలను అత్యధికంగా విడుదల చేసే దేశాల్లో భారత్ మూడో స్ధానంలో ఉంది. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రొగ్రామ్ (యూఎన్ఈపీ) రూపోందించిన అంచనాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఏటా 30 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు వస్తుంటే వాటి బరువు… ఈ భూమ్మీద ఉన్న మొత్తం మానవాళి బరువుతో సమానంగా ఉంటుందని యూఎన్ఈపీ అంచనా వేసింది.
అసలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే……
యూరోపియన్ యూనియన్ రూపోందించిన ప్రమాణాల ప్రకారం 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉండే ప్లాస్టిక్ సంచులను సింగిల్ యూజ్ ప్లాస్టిక్ గా చెప్పవచ్చు. ఈ ప్రమాణాలు ఒక్కో దేశంలో ఒక్కోలా ఉన్నాయి. మనదేశంలో చూస్తే 2021 ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ రూల్స్ ప్రకారం ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులే సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్.
కొన్నిసార్లు వాటిని రీసైకిల్ చెయ్యవచ్చు లేదా వ్యర్థాలుగా వదిలేయవచ్చు కూడా. వీటిలో మనం రోజూ వాడిపారేసే స్ట్రాలు, వాటర్ బాటిళ్లు, క్యారీ బ్యాగులు, ప్లేట్లు,కప్పులు, ఫుడ్ ప్యాకేజి కంటెయినర్లు, ప్లాస్టిక్ స్టిక్స్ చుట్టిన ఇయర్ బడ్స్ వంటివి ఈ జాబితాలోకి వస్తాయి. కాగా ఏటా మిగిలిపోతున్న ప్లాస్టిక వ్యర్ధాలలో 9 శాతం మాత్రమే రీసైకిల్ చేస్తుండగా మరో 12 శాతం వ్యర్ధాలను కాల్చి వేస్తున్నారు. మిగిలిన 79 శాతం వ్యర్ధాలు భూమ్మీద, సముద్రంలోనూ ప్రతి ఏటా గుట్టలు గుట్టలుగా పేరుకు పోతోంది.
1950 దశకం నుంచి దేశంలో ప్లాస్టిక్ ఉత్పత్తి విపరీతంగా పెరిగిపోయింది. దేశంలో ఉత్పత్తి అయ్యే అన్ని వస్తువలను ప్లాస్టిక్ దాటిపోయింది. మన దేశంలో పాలిథీన్ సంచులపై 25 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆంక్షలు అమల్లో ఉన్నాయి. జులై 1 నుంచి అమల్లోకి వచ్చే ప్లాస్టిక్ నిషేధాన్ని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పర్యవేక్షిస్తుంది. ఆయా రాష్ట్రాల్లో రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డులు సీపీసీబీకి నేరుగా రిపోర్ట్ చేస్తాయి. కేంద్రం విధించిన నిషేధిత జాబితాలోఈ క్రింది వస్తువులు ఉన్నాయి.
లాలీపాప్, చాక్లెట్లకు వాడే ప్లాస్టిక్ స్టిక్స్…..బెలూన్లకు వాడే ప్లాస్టిక్ స్టిక్స్….థర్మోకోల్….ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు, స్పూన్లు, కప్లు, స్ట్రాలు, ఫోర్క్లు…100 మైక్రాన్ల లోపు మందం గల పీవీసీ బ్యానర్లు…స్వీట్ బాక్స్లు, ఫుడ్ ప్యాకింగ్లో వాడే ప్లాస్టిక్ కవర్లు….ప్లాస్టిక్ పుల్లలతో ఉండే ఇయర్ బడ్స్…ప్లాస్టిక్ జెండాలు…ఐస్క్రీమ్ పుల్లలు….ప్లాస్టిక్ ఇన్విటేషన్ కార్డులు.