స్కిన్ టూ స్కిన్ కాంటాక్ట్ : బాంబే హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే

స్కిన్ టూ స్కిన్ కాంటాక్ట్ : బాంబే హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే

Skin to Skin contact: Supreme Court stays Bombay HC order acquitting man under POCSO మైనర్‌ బాలిక శరీరాన్ని తాకకుండా లైంగిక వేధింపులకు గురిచేస్తే.. పోక్సో(POCSO) చట్టం ప్రకారం వేధింపుల కిందకు రాదని జనవరి-19న బాంబే హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. బాలికతో స్కిన్‌ టూ స్కిన్‌ కాంటాక్ట్‌ లేకుంటే పోక్సో చట్టం కింద లైంగిక వేధింపులుగా పరిగణించలేమని బాంబే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో బాంబే హైకోర్టు తీర్పుపై బుధవారం(జనవరి-27,2021)సుప్రీంకోర్టు స్టే విధించింది.

2016లో నాగ్‌పూర్‌లో సతీశ్(39)అనే వ్యక్తి పొరుగింట్లో ఉన్న పన్నెండేళ్ల బాలికను లైంగికంగా వేధించాడు. తన వయసు, వివేకం, విచక్షణ మర్చిపోయి అతడు బాలికను అసభ్యంగా తాకాడు. బాలిక దుస్తులు తొలగించబోయాడు. అతడు చేసిన, చేయబోయే దుర్మార్గం తెలుసుకునే వయసు లేకపోయినా….ఏదో జరుగుతోందని గ్రహించి ఆ చిన్నారి ప్రతిఘటించింది. పెద్దగా కేకలు వేసింది. ఆ అరుపులు విన్న తల్లి పరుగు పరుగున వచ్చి బాలికను రక్షించింది. బాలిక తల్లి ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 2016 డిసెంబరులో సెషన్స్ కోర్టు సతీశ్ నేరాన్ని నిర్ధారించి మూడేళ్ల జైలు శిక్ష, ఏడాది కఠిన కారాగార శిక్ష విధించింది. దీనిపై అతను బాంబే హైకోర్టును ఆశ్రయించాడు.

జనవరి-19న సతీష్ పిటిషన్ పై బాంబే హైకోర్టు (నాగ్ పూర్ బెంచ్)తీర్పు వెలువరించారు. నేరస్థుడు బాలిక దుస్తులు తీయలేదు కాబట్టి..ఆమెను దుస్తులపై నుంచే పట్టుకున్నాడు కాబట్టి…పోక్సో చట్టం కింద అది లైంగిక వేధింపుల కిందకు రాదని నాగ్‌పూర్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ పుష్ప గనేడివాలా తీర్పు ఇచ్చారు. సెషన్స్ కోర్టు నేరస్థుడికి విధించిన మూడేళ్ల జైలు శిక్షను ఎత్తివేస్తూ.. పోక్సో చట్టంలోని ఐపీసీ సెక్షన్ 354 కింద విధించిన ఒక సంవత్సరం జైలు శిక్షను మాత్రం కొనసాగించారు న్యాయమూర్తి. ఈ తీర్పుతో యావత్ సమాజం ఉలిక్కి పడింది.

బాంబే హైకోర్టు నాగపూర్‌ బ్రాంచ్‌ న్యాయమూర్తి ఈనెల 19న ఈ ఉత్తర్వుల ద్వారా 12 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన నిందితుడికి పోక్సో కేసు నుంచి తప్పించారని అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ సుప్రీంకోర్టు కి నివేదించారు. నిందితుడికి ఐపీసీ సెక్షన్‌ 354 కింద కేవలం ఏడాది జైలు శిక్షతో సరిపెట్టారని చెప్పారు. దీనిపై ఇవాళ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్‌… నిందితుడు, మహారాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. పోక్సో చట్టం సెక్షన్‌ 8 నుంచి నిందితుడిని తప్పిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేస్తున్నామని సుప్రీం కోర్టు పేర్కొంది.