Sonia Gandhi : నేడు ప్రశాంత్ కిషోర్ సహా కాంగ్రెస్ సీనియర్లతో సోనియాగాంధీ మరోసారి సమావేశం
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్లో చేరవచ్చనే ఊహాగానాల మధ్య గత నాలుగు రోజుల్లో సోనియా గాంధీ, ప్రశాంత్ కిషోర్ మధ్య మూడో సమావేశం జరుగనుంది.
Sonia Gandhi meeting : 2024 లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతోంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సహా కాంగ్రెస్ సీనియర్లతో సోనియాగాంధీ నేడు మరోసారి సమావేశం కానున్నారు. 10 జనపథ్ లో జరిగే సమావేశంలో కమల్ నాథ్, దిగ్విజయ సింగ్, ముకుల్ వాస్నిక్, కెసి వేణుగోపాల్, జైరాం రమేష్, ఎకె ఆంటోనీ, అంబికా సోనీ, రణదీప్ సూర్జేవాలా సహా పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొననున్నారు.
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్లో చేరవచ్చనే ఊహాగానాల మధ్య గత నాలుగు రోజుల్లో సోనియా గాంధీ, ప్రశాంత్ కిషోర్ మధ్య మూడో సమావేశం జరుగనుంది. కాంగ్రెస్ ఎన్నికల వ్యూహాలపై ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్లు ఏప్రిల్ 16, ఏప్రిల్ 18న సమావేశమయ్యారు. రానున్న రోజుల్లో మరో రెండు సమావేశాలు జరగనున్నాయని సమాచారం.
2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన రోడ్ మ్యాప్తో కూడిన వివరణాత్మక ప్రజెంటేషన్ను ఇప్పటికే సోనియాగాంధీకి ప్రశాంత్ కిషోర్ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్, బీహార్ ఒడిశాలో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయాలని ప్రశాంత్ కిషోర్ సూచించారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలో పొత్తులు పెట్టుకోవాలని పీకే సూచించారు.
2024 సార్వత్రిక ఎన్నికల కోసం 370 లోక్సభ నియోజకవర్గాలపై కాంగ్రెస్ దృష్టి పెట్టాలని పీకే సూచించినట్లు సమాచారం. ఈ ఏడాది జరిగే గుజరాత్, హిమాచల్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ సన్నద్దత పైనా పీకే, కాంగ్రెస్ నేతలు చర్చలు జరుపుతున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కిషోర్తో కలిసి పనిచేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. దేశంలో బీజేపీ వ్యతిరేక రాజకీయాలకు మూలాధారంగా నిలవాలని భావిస్తోంది.