Sonu Sood : కరోనా విలయం.. రియల్ హీరో సోనూసూద్ కీలక నిర్ణయం

సెకండ్ వేవ్ దెబ్బకి హాస్పిటల్సే కాదు శ్మశానాలు కూడా ఖాళీ లేకుండా పోయాయి. ప్రజల మనిషిగా, ఆపద్భాంధవుడిగా పేరు తెచ్చుకున్న, ప్రజలు దేవుడిగా భావిస్తున్న సోనూసూద్ ను ఈ పరిస్థితులు కదిలించాయి. దీంతో రియల్ హీరో సోనూసూద్ కీలక నిర్ణయం తీసుకున్నాడు.

Sonu Sood : కరోనా విలయం.. రియల్ హీరో సోనూసూద్ కీలక నిర్ణయం

Sonu Sood

Sonu Sood : కరోనా సెకండ్ వేవ్‌ భారత్ లో విలయతాండవం చేస్తోంది. జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. దేశంలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో ఎంతోమంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. కళ్లముందే అయినవారిని కోల్పోతున్నా.. ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో కుటుంబ సభ్యులు ఉండి పోవాల్సిన దయనీయ పరిస్థితి ఉంది. సెకండ్ వేవ్ దెబ్బకి హాస్పిటల్సే కాదు శ్మశానాలు కూడా ఖాళీ లేకుండా పోయాయి. ప్రజల మనిషిగా, ఆపద్భాంధవుడిగా పేరు తెచ్చుకున్న, ప్రజలు దేవుడిగా భావిస్తున్న సోనూసూద్ ను ఈ పరిస్థితులు కదిలించాయి. కోవిడ్ పేషెంట్లు ఆక్సిజన్ కోసం పడుతున్న కష్టాలను తీర్చేందుకు రియల్ హీరో సోనూసూద్ మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు.

దేశంలో ముందు ముందు ఆక్సిజన్ పాత్ర మరింతగా ఉండే అవకాశం ఉందని భావించి.. కొవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్‌లను నెలకొల్పాలనే సంచలన నిర్ణయం తీసుకున్నాడు సోనూసూద్. ఇప్పటికే ఫ్రాన్స్‌ నుంచి ఓ ప్లాంట్‌కి ఆర్డర్ చేశామని.. మరో 10-12 రోజులలో అక్కడ నుంచి ఆక్సిజన్ ప్లాంట్ రాబోతున్నట్లుగా సోనూసూద్ తెలిపాడు. అలాగే ఇంకొన్ని దేశాల నుంచి.. ప్లాంట్‌లను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లుగా సోనూ ప్రకటించారు. ‘‘ప్రస్తుతం సమయం అనేది అతి పెద్ద సవాలుగా మారింది. ప్రతీది సమయానికి అందించేలా.. మా వంతుగా ఎంతగానో కృషి చేస్తున్నాము. ఇక మన ప్రాణాల్ని కాపాడుకోగలం..’’ అని సోనూసూద్ అన్నాడు. కోవిడ్ తీవ్రత అధికంగా ఉన్న ఢిల్లీ, మహారాష్ట్ర లాంటి ప్రాంతాల్లో కనీసం నాలుగు ఆక్సిజన్ ప్లాంట్లు నెలకొల్పాలని సోనూ యోచిస్తున్నాడు.

”ఆక్సిజన్ అందక ఎంతోమంది బాధలు పడుతున్నారు. మనం కళ్లారా చూస్తున్నాం. ఆక్సిజన్ వచ్చినట్టే. త్వరలోనే ప్రజలకు అందిస్తాం. అయితే ఈ ఆక్సిజన్ ప్లాంట్లు దేశంలోని అన్ని ఆసుపత్రులకు ఆక్సిజన్ సరఫరా చెయ్యలేకపోవచ్చు. కానీ సిలిండర్లను నింపగలం. కరోనాతో బాధితుల అతి పెద్ద సమస్యను పరిష్కరించగలం” అని సోనూసూద్ అన్నారు.