Southwest Monsoon: వాతావరణశాఖ చల్లటి కబురు: మే 29న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు

Southwest Monsoon: వాతావరణశాఖ చల్లటి కబురు: మే 29న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు

Monsoon

Southwest Monsoon: భారత వాతావరణశాఖ చల్లటి కబురు చెప్పింది. ఎపుడెపుడా అని ఎదురు చూస్తున్న నైరుతి రుతుపవనాలు మరో రెండు రోజుల్లో అంటే మే 29న కేరళను తాకనున్నట్లు వాతావరణశాఖ(IMD) తెలిపింది. ఈమేరకు ఐఎండీ వాతావరణ విభాగం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే అండమాన్ నికోబర్ దీవులను దాటిన రుతుపవనాలు..బలమైన గాలుల ప్రభావంతో దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, లక్షద్వీప్, సహా కొమొరిన్ పై విస్తరించి ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. గాలుల్లో స్థిరత్వం, వేగం ఇలానే కొనసాగనున్న నేపథ్యంలో మే 29-30 మధ్య రుతుపవనాలు కేరళను తాకనున్నాయి. తాజా వాతావరణ సూచనల ప్రకారం, దక్షిణ అరేబియా సముద్రం మీదుగా దిగువ స్థాయిలలో పశ్చిమ గాలులు బలపడి లోతుగా మారాయి. ఉపగ్రహాల చిత్రాల ప్రకారం, కేరళ తీరం మరియు దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రంపై ఆకాశం మేఘావృతం అయింది.

అందువల్ల, రాబోయే 2-3 రోజుల్లో కేరళలో రుతుపవనాలు ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. అదే సమయంలో నైరుతి రుతుపవనాలు అరేబియా సముద్రం మరియు లక్షద్వీప్ ప్రాంతంలో మరికొన్ని ప్రాంతాలలోకి ప్రవేశించేందుకు మరిన్ని పరిస్థితులు కూడా అనుకూలంగా ఉన్నట్లు IMD తెలిపింది. కాగా, మే 29 వరకు కేరళలో వివిధ జిల్లాలకు జారీచేసిన ఎల్లో అలర్ట్‌ను ఐఎండీ ఉపసంహరించుకుంది. మరోవైపు..ఉత్తర భారతంలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీ సహా ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో వడగండ్ల వానలు కురుస్తున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం తరువాత ఆయా రాష్ట్రాల్లో అనేక జిల్లాల్లో 50-60 కిలోమీటర్ల వేగంతో దుమ్ముధూళితో కూడిన గాలులు వీస్తూ..భారీ వర్షాలు కురుస్తున్నాయి.

other stories: