బెంగళూరులో భయానకం.. ప్రైవేట్ ఆసుపత్రుల్లో డాక్టర్లు, నర్సుల తీవ్ర కొరత

  • Published By: naveen ,Published On : July 7, 2020 / 10:37 AM IST
బెంగళూరులో భయానకం.. ప్రైవేట్ ఆసుపత్రుల్లో డాక్టర్లు, నర్సుల తీవ్ర కొరత

కర్నాటక రాజధాని బెంగళూరులోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో పరిస్థితి భయానకంగా ఉంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. దీంతో కరోనా బాధితులకు చికిత్స అందించడంలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కరోనా రోగులకు ట్రీట్ మెంట్ ఇవ్వలేని పరిస్థితిని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు ఎదుర్కొంటున్నాయి. శివాజీనగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో డాక్టర్లు, నర్సులు, సిబ్బంది కొరత ఏర్పడింది. అంటే అక్కడ సిబ్బందిని నియమించ లేదని కాదు. కావాల్సినంత మంది స్టాఫ్ ని అపాయింట్ చేసుకున్నారు. కానీ వారు విధులకు హాజరు కావడం లేదు. శివాజీనగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో 44 మంది డాక్టర్లు, 20 మంది నర్సులు పని చేస్తున్నాయి. అయితే వారిలో చాలామంది విధులకు రావడం లేదు. ఇప్పుడు కేవలం ఐదుగురు డాక్టర్లు, 12మంది నర్సులు మాత్రమే డ్యూటీకి వస్తున్నారు. వారితోనే అన్ని పనులు చేయించుకోవాల్సి వస్తోంది.

డ్యూటీకి రావడం లేదు:
శివాజీనగర్ లోని హెచ్ బీఎస్ ఆసుపత్రిలోని దుస్థితి ఇది. ఆసుపత్రి మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ తాహా మతీన్ తీవ్ర ఆవేదనలో ఉన్నారు. దయచేసి డాక్టర్లు, నర్సులు అందరూ విధులకు రండి అని ఆమె రిక్వెస్ట్ చేశారు. ”సరిపడ స్టాఫ్ లేని కారణంగా ఐసీయూలో చికిత్స పొందుతున్న కరోనా రోగుల బాగోగులు చూసుకోవడం కష్టం మారింది. ఆసుపత్రిలో 8మంది కరోనా బాధితులు ఉన్నారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. శ్వాస సంబంధ సమస్యతో బాధపడుతున్నారు. వారిలో ఆరుగురు ఐసీయూలో ఉన్నారు. మా ఆసుపత్రిలో 80 బెడ్స్ ఉన్నాయి. కరోనా రోగులకు చికిత్స చేయడానికి మా ఆసుపత్రిలో సరిపడ బెడ్లు ఉన్నాయి. కానీ కేవలం 5మంది డాక్టర్లు మాత్రమే విధులకు వస్తున్నారు. ఆ కారణంగానే ఎక్కువ మంది కరోనా రోగులను ఆసుపత్రిలో చేర్చుకోలేకపోతున్నాము” అని హెచ్ బీఎస్ ఆసుపత్రి మేనేజింగ్ ట్రస్టీ వాపోయారు.

ఆరోగ్యం బాగోలేదని సమాధానం:
డాక్టర్లు, నర్సులు విధులకు ఎందుకు రావడం లేదని అడిగితే.. తమకు ఆరోగ్యం బాగోలేదని చెబుతున్నారట. తలనొప్పి, జ్వరం, జలుబుతో బాధపడుతున్నామని, విధులకు రాలేమని సమాధానం ఇస్తున్నారట. అనారోగ్య కారణాలు చూపడంతో యాజమాన్యం కూడా ఏమీ అనలేకపోతోంది. ”మా దగ్గర ఆక్సిజన్ ఉంది. బెడ్లు ఉన్నాయి, వెంటిలేటర్లు ఉన్నాయి. మరో 30మంది కరోనా రోగులను అడ్మిట్ చేసుకోగల కెపాసిటీ ఉంది. కానీ వారికి ట్రీట్ మెంట్ చేయడానికి డాక్టర్లు ఎక్కడ ఉన్నారు? దయచేసి విధులకు రండి, కేవలం 6 గంటల సమయాన్ని వెచ్చించండి” అని హెచ్ బీఎస్ ఆసుపత్రి మేనేజింగ్ ట్రస్టీ మతీన్ అభ్యర్థించారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో, కరోనా కష్టకాలంలో డాక్టర్లు పెద్ద మనసు చూపించాలని, మానవత్వంతో స్పందించి విధులకు హాజరుకావాలని మేనేజింగ్ ట్రస్టీ కోరారు.

ప్రైవేటు ఆసుపత్రుల్లో డాక్టర్లు, నర్సులు, సిబ్బంది కొరత:
ఒక హెచ్బీఎస్ ఆసుపత్రిలోనే కాదు నగరంలోని చాలా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇలాంటి దుస్థితే ఉంది. డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది విధులకు హాజరు కావడం లేదు. అదేమంటే, ఆరోగ్యం బాగోలేని చెబుతున్నారు. వాస్తవానికి వాదరందికి కరోనా భయం పట్టుకుంది. కరోనా రోగులకు ట్రీట్ మెంట్ చేస్తున్న సమయంలో తమకు ఎక్కడ కరోనా సోకుతుందోనని అంతా భయపడుతున్నారు. తమ వల్ల తమ కుటుంబసభ్యులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే డ్యూటీకి రావడం లేదని తెలుస్తోంది. బెంగళూరు నగరంలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో నెలకొన్న పరిస్థితి కరోనా రోగులను ఆందోళనకు గురి చేస్తోంది.