ఆక్సిజన్,వ్యాక్సిన్,రెమ్ డెసివర్ కొరతపై కేంద్రానికి రాష్ట్రాలు కంప్లెయింట్
మహమ్మారి కట్టడికి చేపట్టాల్సిన చర్యలపై కేసులు భారీగా పెరుగుతున్న 11 రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం కీలక సమావేశం నిర్వహించింది.
States దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహమ్మారి కట్టడికి చేపట్టాల్సిన చర్యలపై కేసులు భారీగా పెరుగుతున్న 11 రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం కీలక సమావేశం నిర్వహించింది. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్థన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య మంత్రులు పాల్గొని..కరోనా కట్టడి విషయంలో నెలకొన్న సమస్యలను కేంద్రానికి వివరించారు. ఆక్సిజన్ సిలిండర్లు, ఆస్పత్రులకు రెమ్డెసివిర్ ఔషధాలు, వెంటిలేటర్లు, వ్యాక్సిన్ డోసులను సరఫరా చేయాలని ఈ సందర్భంగా రాష్ట్రాలు కేంద్రాన్ని కోరాయి. ఈ భేటీలో మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేతో కేంద్రమంత్రి మాట్లాడారు. వైరస్ తీవ్రతతో సతమతమవుతున్న రాష్ట్రానికి నిరంతర ఆక్సిజన్ సరఫరాలతో పాటు అవసరమైన సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.
కోవిడ్ ఆస్పత్రులు, ఆక్సిజన్ సదుపాయం ఉన్న పడకల సంఖ్యను పెంచాలని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ సూచించారు. ఐదు, ఆరు నగరాలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని పేర్కొన్నారు. ఈ నగరాలకు లేదా పక్కన ఉన్న రెండు, మూడు జిల్లాలకు ఓ మెడికల్ కాలేజీని అనుసంధానించాలని చెప్పారు. మహారాష్ట్రకు 1,121 వెంటిలేటర్లు, యూపీకి 1,700, ఝార్ఖండ్కు 1500, గుజరాత్కు 1600, మధ్యప్రదేశ్కు 152, ఛత్తీస్గఢ్కు 230 వెంటిలేటర్లను సరఫరా చేయనున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు 14.15 కోట్ల టీకా డోసులను సరఫరా చేయగా.. వృథా అయిన వాటితో కలిపి 12.57 కోట్ల డోసులను వినియోగించినట్లు హర్షవర్ధన్ తెలిపారు. 1.58 కోట్ల డోసులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. వచ్చే వారం లోపు 1.16 డోసులను సరఫరా చేయనున్నట్లు చెప్పారు. చిన్న రాష్ట్రాలకు ఏడు రోజులకు, పెద్ద రాష్ట్రాలకు నాలుగు రోజులకు ఓసారి డోసులను పంపిస్తున్నట్లు వివరించారు. టీకా డోసులకు కొరత లేదని, వ్యాక్సినేషన్ను ముమ్మరం చేయాలని స్పష్టం చేశారు
సమావేశం అనంతరం అధికారిక ప్రకటన విడుదల చేసిన కేంద్ర వైద్య శాఖ… రెమ్డెసివిర్ను బ్లాక్ మార్కెట్లో విచ్చలవిడి రేట్లకు విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు కోరినట్లు తెలిపింది. మహారాష్ట్రలో డబుల్ మ్యుటెంట్ స్ట్రెయిన్ ఆందోళనకరంగా మారిందని పేర్కొంది. కేంద్రం అధీనంలో ఉన్న హాస్పిటల్స్ లో అదనపు బెడ్స్ ఏర్పాటు చేయాలని డిల్లీ ప్రభుత్వం కోరినట్లు తెలిపింది. కొవిడ్ నియంత్రణ కోసం రాష్ట్ర విపత్తు స్పందన నిధుల్లో 50 శాతం ఉపయోగించుకునేలా అనుమతిస్తూ కేంద్ర హోంశాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ సహా నేషనల్ హెల్త్ మిషన్ కింద ఖర్చు చేయని నిధులను వినియోగించుకునేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఉత్తర్వులు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిపింది.
మెడికల్ ఆక్సిజన్ సరఫరాతో పాటు రెమ్డెసివిర్ అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్రాలకు భేటీ సందర్భంగా వివరించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు. దేశంలోని వివిధ తయారీదారుల నుంచి ఆక్సిజన్ సరఫరా కోసం రూపొందించిన క్యాలెండర్ గురించి రాష్ట్రాలకు వివరించినట్లు చెప్పారు. తయారీ కేంద్రాల నుంచి ఆక్సిజన్ సరఫరా సజావుగా సాగేలా చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.