Sundar Pichai : గూగుల్​ సీఈఓ​పై కాపీరైట్​ ఉల్లంఘన కేసు..!

గూగుల్‌ (Google) సీఈవో సుందర్‌ పిచాయ్‌పై కాపీరైట్ ఉల్లంఘన కేసు నమోదు అయింది.

Sundar Pichai : గూగుల్​ సీఈఓ​పై కాపీరైట్​ ఉల్లంఘన కేసు..!

Mumbai Police Books Google

Sundar Pichai : గూగుల్‌ (Google) సీఈవో సుందర్‌ పిచాయ్‌పై కాపీరైట్ ఉల్లంఘన కేసు నమోదు అయింది. ముంబై కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు పిచాయ్ సహా కంపెనీలోని మరో ఐదుగురు అధికారులపై కాపీరైట్ ఉల్లంఘన కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ‘ఏక్‌ హసీనా థీ ఏక్‌ దివానా థా’ అనే మూవీకి తమ అనుమతి లేకుండా యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశారంటూ ఆ మూవీ డైరెక్టర్‌, నిర్మాత సునీల్‌ దర్శన్‌ కోర్టును ఆశ్రయించారు.

కోర్టు ఆదేశాలతో యూట్యూబ్‌ పేరంట్ కంపెనీ గూగుల్ ప్రతినిధులైన సుందర్‌ పిచాయ్‌ సహా ఇతరులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు పోలీసులు. ఇప్పటివరకూ తన సినిమా హక్కుల్ని ఎవరికి అమ్మలేదని పిటిషనర్ కోర్టు పిటిషన్‌లో పేర్కొన్నారు. యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేయడం ద్వారా తనకు నష్టం వాటిల్లిందని నిర్మాత సునీల్ తెలిపారు.

ఈ విషయంలో యూట్యూబ్‌కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. పిటిషన్​ను పరిశీలించిన కోర్టు కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఏక్‌ హసీనా థీ ఏక్‌ దివానా థా మూవీ 2017లో విడుదల అయింది.

రొమాంటిక్‌ మ్యూజికల్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ పెద్దగా ఆడలేదు. బీ గ్రేడ్‌ మూవీ కోసం దర్శకుడు కోర్టుకెక్కడం విడ్డూరంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌కు పద్మ భూషణ్‌ పురస్కారం దక్కిన సంగతి తెలిసిందే.

Read Also : Bike Launch: భారత మార్కెట్లోకి హోండా CBR650R 2022 మోడల్, ధర ఎంతో తెలుసా?