సెంట్రల్ విస్టా శంకుస్థాపనకు సుప్రీం అనుమతి..కానీ!
Supreme Court :ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు మూడు కి.మీ మేర నిర్మించ తలపెట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై సోమవారం(డిసెంబర్-7,2020)సుప్రీంకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. సెంట్రల్ విస్టా నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సోమవారం విచారణ జరిపిన జస్టిస్ ఏఎం ఖాన్ విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం…ప్రాజెక్టు పట్ల కేంద్రం అనుసరిస్తున్న తీరుపై అసహనం వ్యక్తం చేసింది. పెండింగ్లో ఉన్న పిటిషన్లపై నిర్ణయం తీసుకునే వరకు ఎలాంటి నిర్మాణాలు, లేదా కూల్చివేతలు చేపట్టకూడదని ధర్మాసనం స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు నిర్ణయం వెలువడే వరకు ప్రాజెక్టులో నిర్మాణాలు, కూల్చువేతల వంటివి చేపట్టబోమని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనానికి హామీ ఇచ్చారు. దీంతో ఈ ప్రాజెక్టు కోసం అవసరమైన కాగితపు వర్క్, ప్రతిపాదిత గ్రౌండ్ బ్రేకింగ్ వేడుక లేదా శంకుస్థాపనకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది.
కాగా, డిసెంబర్ 10న నూతన పార్లమెంట్ భవన నిర్మాణానికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. రూ.971 కోట్లతో చేపడుతోన్న ఈ నిర్మాణాన్ని 2022లోపు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. కొత్త పార్లమెంట్ భవనాన్ని టాటా ప్రాజెక్ట్స్ నిర్మిస్తోంది.
కాగా, నూతన పార్లమెంట్ భవనం సహా ఇతర విభాగాల నిర్మాణాలు ఒకే చోట చేపట్టేందుకు గత ఏడాది సెప్టెంబర్ లో ఈ ప్రాజెక్టును కేంద్రం ప్రకటించింది. దేశ రాజధానిలో వివిధ మంత్రిత్వశాఖలు అద్దె రూపేణా చెల్లిస్తున్న మొత్తాలను ఆదా చేయడంతో పాటు మెరుగైన సమన్వయం కోసమే రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు మూడు కి.మీ మేర సెంట్రల్ విస్టా ప్రాజెక్టును తీర్చిదిద్దాలని నిర్ణయించినట్లు కేంద్రప్రభుత్వం చెబుతోంది. ఇదే ప్రాజెక్టులో ఉమ్మడి కేంద్ర సచివాలయాన్ని 2024 వరకు నిర్మించతలపెట్టారు.