Supreme Court : వన్ నేషన్-వన్ రేషన్ అమలు చేయాల్సిందే
పశ్చిమ బెంగాల్ సర్కార్కు సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది.
Supreme Court పశ్చిమ బెంగాల్ సర్కార్కు సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. కేంద్రం తీసుకొచ్చిన ఒకే దేశం-ఒకే రేషన్ కార్డు పథకాన్ని రాష్ట్రంలో తక్షణమే అమలుచేయాలని మమత సర్కార్ ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇది వలస కార్మికుల కోసం ఏర్పాటు చేసిన పథకమని దీనిపై ఎలాంటి సమస్యలు సృష్టించవద్దని స్పష్టం చేసింది. కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో వలస కార్మికుల ఇబ్బందులపై శుక్రవారం జరిగిన విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
కాగా, కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వన్ నేషన్-వన్ రేషన్ స్కీమ్ను తీసుకొచ్చింది. దేశంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లే వారికి ప్రయోజనం చేకూర్చే దిశగా కేంద్రం ఈ పథకాన్ని రూపొందించింది. ఈ పథకం ద్వారా రేషన్ కార్డుదారులు దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకొవచ్చు. పశ్చిమ బెంగాల్, అస్సాం, ఢిల్లీలో తప్ప దేశవ్యాప్తంగా ఒకే దేశం.. ఒకే రేషన్ పథకం అమలవుతుంది. అయితే, రాజకీయ కారణాలతో సీఎం మమత బెంగాల్లో, సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో ఈ పథకాన్ని అమలు చేయడం లేదని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.