Amazon, Flipkart కంపెనీలకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
ఈ-కామర్స్ దిగ్గజ కంపెనీలు అమెజాన్,ఫ్లిప్కార్ట్లకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Amazon, Flipkart ఈ-కామర్స్ దిగ్గజ కంపెనీలు అమెజాన్,ఫ్లిప్కార్ట్లకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమ అంతర్గత వ్యాపార విధానాలపై సీసీఐ(కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా) దర్యాప్తును నిలిపివేయాలంటూ ఈ కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్లను సోమవారం సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి పెద్ద సంస్థలు.. దర్యాప్తు, పారదర్శకత వంటి అంశాల్లో స్వచ్ఛందంగా వ్యవహరించాలి. ఇలాంటి విచారణలకు ముందుకు రావాలి. కానీ మీరు దర్యాప్తే జరగకూడదని అనుకుంటున్నారు. అయితే ఈ వ్యవహారంలో విచారణ జరగాలి. మీరు నివేదికలు సమర్పించాలి అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది.విచారణకు హాజరయ్యేందుకు అమెజాన్,ఫ్లిప్కార్ట్లకు నాలుగు వారాల సమయం కేటాయించింది ధర్మాసనం.
అసలేం జరగింది..అమెజాన్,ఫ్లిప్కార్ట్లపై సీసీఐ దర్యాప్తు ఎందుకు
అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సంస్థలు కొన్ని అసంబద్ధ విధానాలకు పాల్పడుతున్నాయంటూ ఢిల్లీ వ్యాపార మహాసంఘం సీసీఐకి ఫిర్యాదు చేసింది. ఆ రెండు కంపెనీలు మార్కెట్ పోటీతత్వ చట్టాలను ఉల్లంఘిస్తూ.. కొంతమంది విక్రేతలను మాత్రమే ప్రోత్సహిస్తున్నాయని ఆరోపించింది. ముఖ్యంగా మొబైల్ ఫోన్ లాంచింగ్ లాంటి వాటిని ఈ సందర్భంగా వ్యాపార మహాసంఘం సీసీఐ దృష్టికి తీసుకొచ్చింది. ఈ ఫిర్యాదుపై స్పందించిన సీసీఐ.. ఆ రెండు ఈ కామర్స్ కంపెనీల మీద గతేడాది జనవరిలో విచారణకు ఆదేశించింది. అయితే ఈ ఆరోపణలను అమెజాన్, ఫ్లిప్కార్ట్ కొట్టిపారేశాయి.
సీసీఐ ఎలాంటి రుజువులు లేకుండానే దర్యాప్తు చేపట్టిందని ఆరోపిస్తూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాయి. అయితే అక్కడ వీటికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ రెండు కంపెనీల పిటిషన్లకు విచారణయోగ్యత లేదంటూ జులై 23న కర్ణాటక హైకోర్టు తోసిపుచ్చింది. వీటి వ్యాపార విధానాలపై విచారణ జరపాల్సిందేనని తేల్చిచెప్పింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఈ సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఇక్కడ కూడా నిరాశే ఎదురైంది. సీసీఐ విచారణను నిలిపివేయాలన్న సంస్థల అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది.