తొలిసారి ఎన్నికల బరిలో.. గెలవాలని కాదు ప్రజాసేవకి: ఆదిత్య థాక్రే

  • Published By: vamsi ,Published On : September 30, 2019 / 03:54 PM IST
తొలిసారి ఎన్నికల బరిలో.. గెలవాలని కాదు ప్రజాసేవకి: ఆదిత్య థాక్రే

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు శివసేన యువ నాయకులు, బాల్‌థాకరే మనవడు ఆదిత్య థాక్రే స్పష్టం చేశారు. శివసేనకు కంచుకోటగా పరిగణించే వొర్లి స్ధానం నుంచి ఆదిత్య థాక్రే పోటీ చేయనున్నారు.

ముంబైలో జరిగిన ర్యాలీలో మాట్లాడిన ఆదిత్య థాక్రే గతంలో బాలాసాహెబ్‌కు ఆ తర్వాత మా తండ్రి ఉద్దవ్‌కు ప్రేమాభిమానాలు అందించిన మీరు అదే ప్రేమను తన యాత్ర సందర్భంగా కొద్దిరోజులుగా తనపై కురిపిస్తున్నారని, అందుకు నాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.

ఇదే సమయంలో తాను వొర్లి నుంచి పోటీ చేస్తున్నా అంటూ ప్రకటించారు. యావత్‌ మహారాష్ట్ర తన కర్మభూమిగా ఉంటుందని ఆదిత్య స్పష్టం చేశారు. తాను ఎమ్మెల్యే, మంత్రి, లేదా ముఖ్యమంత్రి కావాలనే కోరికతో పోటీ చేయట్లేదని, ప్రజలకు సేవ చేసేందుకే పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు.

బాల్‌థాకరే శివసేనను 1966లో స్ధాపించినప్పటి నుంచి థాక్రే కుటుంబం​ నుంచి ఏ ఒక్కరూ పోటీ చేయలేదు. అలాగే రాజ్యాంగ పదవిని చేపట్టలేదు. థాక్రే కుటుంబం నుంచి తొలిసారిగా ఆదిత్య థాక్రే ఎన్నికలలో నిలవడం గమనార్హం.