సుశాంత్ కేసులో మరో ట్విస్ట్..సుప్రీంకోర్టులో బీహర్ సర్కార్ కేవియట్ పిటిషన్

  • Published By: madhu ,Published On : July 31, 2020 / 01:27 PM IST
సుశాంత్ కేసులో మరో ట్విస్ట్..సుప్రీంకోర్టులో బీహర్ సర్కార్ కేవియట్ పిటిషన్

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు మలుపులు తిరుగుతోంది. కేసు విచారణకు ముంబై పోలీసులు సహకరించడం లేదని బీహార్ పోలీసులు ఆరోపిస్తున్నారు. తాజాగా బీహార్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కెవియట్ పిటిషన్ దాఖలు చేసింది. కేసు విచారణను ముంబై పోలీసులకు అప్పగించాలని రియా చక్రవర్తి వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా.. తమ వాదనలు కూడా వినాలని సుశాంత్ తండ్రి కేకే సింగ్, బీహార్ సర్కార్ కోరారు.



మరోవైపు సుశాంత్ ఆత్మహత్య కేసుకు సంబంధించి దర్యాప్తు ముమ్మరం చేశారు బీహార్ పోలీసులు. ఈ మేరకు సుశాంత్ వ్యక్తిగత వైద్యుడిని పోలీసులు విచారించారు. డాక్టర్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. అలాగే సుశాంత్ స్నేహితులను కూడా విచారించే అవకాశముంది.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యకు సంబంధించి సుశాంత్ తండ్రి ఫిర్యాదు మేరకు రియా చక్రవర్తితో పాటు మరో ఐదుగురిపై పాట్నా పోలీసులు కేసు నమోదు చేశారు. సుశాంత్ ఆత్మహత్యకు రియా సాయం చేసిందని, తన కొడుకు చనిపోవడానికి రియానే కారణమని ఫిర్యాదు చేసినట్లు పట్నా సెంట్ర్ జోన్ ఇన్స్ పెక్టర్ సంజయ్ సింగ్ వెల్లడించారు.



సుశాంత్ ఆర్థిక లావాదేవీలు కూడా పూర్తిగా రియా చూసుకునేదని, ఆత్మహత్యకు 6 రోజుల ముందు డబ్బు, నగలతో ప్లాట్ ఖాళీ చేసి వెళ్లిపోయిందని కేకే సింగ్ ఫిర్యాదులో వెల్లడించారు. సుశాంత్‌కు సంబంధించిన క్రెడిట్ కార్డులు సైతం రియా దగ్గరనే ఉందని.. సుశాంత్ ఆత్మహత్యకు కారణమైందని తెలిపాడు.

కేకే సింగ్ ఫిర్యాదుతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. ఆమెపై 9ఆరోపణలు పేర్కొన్నారు. రియాతో పాటు మరో ఐదుగురిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని పోలీసు అధికారులు వెల్లడించారు.



ముంబై వెళ్లిన పట్నా పోలీస్‌ బృందం దర్యాప్తులో.. సుశాంత్‌ బ్యాంక్ అకౌంట్‌ నుంచి 15 కోట్ల రూపాయలు ట్రాన్స్‌ఫర్‌ అయినట్టు గుర్తించారు. అలాగే సుశాంత్‌ బ్యాంకు లావాదేవీలన్నీ రియా, ఆమె కుటుంబ సభ్యులే నిర్వహిస్తున్నట్లు తేలింది. జూన్‌ 8న సుశాంత్‌ ఇంటి నుంచి రియా క్యాష్‌, జ్యువెలరీ తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. సుశాంత్‌ మెడికల్‌ రిపోర్టులను తీసుకెళ్లి.. వాటిని అందరికీ చూపిస్తానని రియా బెదిరించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.