జంపింగ్ జపాంగ్ : కాంగ్రెస్ లోకి బీజేపీ ఎంపీ

2019 ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతలు పార్టీల మార్పులు మొదలయ్యాయి. ఇప్పటికే పలువురు నేతలు తాము ఉన్న పార్టీలో ఈ సారి టికెట్ రాదనో, వేరే వేరే కారణాలతో పార్టీలు జంప్ చేశారు. ఇప్పుడు బీజేపీ నుంచి సస్పెండ్ అయిన ఎంపీ కీర్తి ఆజాద్ ఇవాళ(ఫిబ్రవరి-18,2019) కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆజాద్ కు పార్టీ కండువా కప్పి స్వాగతించారు. ప్రస్తుతం బీహార్ లోని దర్బాంగా నియోజకవర్గానికి ఎంపీగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
మాజీ బీహార్ సీఎం భగవత్ జా ఆజాద్ కుమారుడైన కీర్తి ఆజాద్ మాజీ క్రికెటర్ కూడా. 1980-86 మధ్యకాలంలో టీమిండియా తరపున ఏడు టెస్ట్ లు,25వన్డేలు ఆడాడు. 2014 ఎన్నికల్లో దర్బాంగా నుంచి బీజేపీ తరపున ఎంపీగా గెలిచి మూడోసారి లోక్ సభలో అడుగుపెట్టిన ఆజాద్ ని పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని బీజేపీ సస్పెండ్ చేసింది. వాస్తవానికి మూడు రోజుల క్రితమే ఆజాద్ కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించినప్పటికీ పుల్వామా ఉగ్రదాడి ఘటన కారణంగా ఆ కార్యక్రమానికి సోమవారానికి వాయిదా వేశారు.