Suzuki Electric Car : మారుతి సుజుకి నుంచి మొదటి ఎలక్ట్రిక్ కారు, ముందుగా భారత్లోనే
మారుతి సుజుకి సైతం రంగంలోకి దిగింది. జపాన్కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ సుజుకి మోటార్ కార్పోరేషన్ ఎలక్ట్రిక్ కారు లాంచ్ చేయనుంది. అదీ కూడా ముందుగా మన భారత్ లోనే.
Suzuki Eelctric Car : ప్రస్తుతం అని వాహన తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్ వెహికల్స్ పై ఫోకస్ పెట్టాయి. కస్టమర్ల కోసం ఎలక్ట్రిక్ వాహనాలు తీసుకొస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు తమ ఎలక్ట్రిక్ వెహికల్స్ లాంచ్ చేశాయి. తాజాగా మారుతి సుజుకి సైతం రంగంలోకి దిగింది. జపాన్కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ సుజుకి మోటార్ కార్పోరేషన్ ఎలక్ట్రిక్ కారు లాంచ్ చేయనుంది. అదీ కూడా ముందుగా మన భారత్ లోనే. భారత్లో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న ఆదరణకు అనుగుణంగా 2025 నాటికి భారత్లో ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు మారుతి సుజుకి చర్యలు చేపట్టింది. తొలి ఎలక్ట్రిక్ వాహనాన్ని భారత్లో లాంచ్ చేయాలని కంపెనీ ఒక నివేదికలో తెలిపింది.
మారుతి భాగస్వామ్యంతో భారత్లో సుజుకి చలామణీ అవుతున్న విషయం తెలిసిందే. కంపెనీ తీసుకున్న నిర్ణయంతో కాంపాక్ట్ కార్ల విభాగంలో జపనీస్ కార్ల తయారీ సంస్థ సుజుకీ ఎలక్ట్రిక్ మొబిలిటీ వాహనాలు వృద్ధికి మరింత సహాయపడనుంది. భారత ఆటోమొబైల్స్ రంగంలో మారుతి సుజుకీ అతిపెద్ద వాహన తయారీ సంస్థగా నిలిచింది. భారత్లో మారుతి సుజుకీ అమ్మకాలు ఎక్కువగా ఆల్టో, వాగన్ఆర్, బాలెనో, స్విఫ్ట్ వంటి చిన్న కాంపాక్ట్ కార్లు ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి.
ఎలక్ట్రిక్ వాహనాన్ని తొలుత భారత మార్కెట్లో విడుదల చేయాలని సుజుకీ భావిస్తోంది. ఆ తర్వాత జపాన్, యూరప్ వంటి ఇతర దేశాల్లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మారుతి సుజుకీ వాగన్ఆర్ వాహనాలను ఈవీగా పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ పరీక్షలపై మారుతి సుజుకీ అధికారికంగా ధృవీకరించ లేదు. మారుతి సుజుకీ ఎక్కువగా సీఎన్జీ వాహన శ్రేణులపై దృష్టిపెట్టింది. భారత ప్రభుత్వం 2030 నాటికి కార్లలో కనీసం 30% ఎలక్ట్రిక్ వాహనాలు ఉండేలా ప్రణాళికలను రూపొందించింది. అంతేకాకుండా ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు భారీగా ప్రోత్సాహాకాలను ప్రకటించిన సంగతి తెలిసిందే.