80 ఏళ్ల బంధం : మరణంలోను వీడని దంపతులు

  • Published By: veegamteam ,Published On : November 13, 2019 / 10:52 AM IST
80 ఏళ్ల బంధం : మరణంలోను వీడని దంపతులు

జీవితంలో ఒకరికి ఒకరుగా తోడున్నారు. వివాహ బందంతో ఒకటైన ఆ జంట కష్టాల్ని కన్నీళ్లనీ..సుఖాలను..సంతోషాలను పంచుకున్నారు. నీకు నేను..నాకు నీవు అన్నట్లుగా అన్యోన్యంగా కలిసి మెలిసి కాపురం చేశారు. అలా 80 సంవత్సరాల పాటు జీవించారు. చూసినవారంతా వారిని ఆది దంపతులు అనేవారు. వారి ఆశీర్వాదాలు తీసుకునేవారు. అటువంటి సమయంలో భర్తకు గుండె నొప్పి వచ్చి మరణించాడు. అన్ని సంవత్సాల పాటు..కాదు దశాబ్దాల పాటు పాలు తేనెల్లా కలిసి జీవించిన సహచరుడు మృతి ఆమె మనస్సుని తీవ్రంగా కలిచివేసింది. కంటికి కడివెడు కన్నీరు కారుస్తూ..నీవు లేని ఈ జీవితం..ఈ లోకం..నాకెందుకు అనుకుంది..అంతే..కన్నీటితో రోదిస్తూ భర్త భౌతికకాయంపై పడి నేను కూడా నీవెంటేనంటూ తుది శ్వాస విడిచిందామె..ఇది కథ కాదు వాస్తవం..తమిళనాడులో సోమవారం (నవంబర్ 11)న  జరిగిన ఈ విషాదం చోటుచేసుకుంది.  

తమినాడులోని పుదుక్కొట్టై జిల్లాలోని కుప్పకూడిలో వట్రివేల్ కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అతని వయస్సు 104. అతని భార్య పిచాయి. వయస్సు 100. వారిద్దరికీ వివాహం జరిగి 80 ఏళ్లు అయ్యింది. వారికి ఐదుగురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. 23 మనుమలు..మనుమరాండ్రు ఉన్నారు. అంతా ఉమ్మడి కుటుంబంగానే జీవిస్తున్నారు. ఆనందాలు వెల్లివిరిసే వారి జీవితాల్లో  సోమవారం రాత్రి విషాదం నింపింది. 

104 సంవత్సరాల వట్రివేల్‌కు ఛాతిలో నొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే వట్రివేల్‌ చనిపోయారని డాక్టర్లు నిర్ధారించారు. దీతో ఇంటికి తీసుకొచ్చారు. భర్త వరణాన్ని పిచాయ్ తట్టుకోలేకపోయింది. భర్త  శవం పక్కనే కూర్చున్న పిచాయి కన్నీరు పెడుతూ స్పృహ తప్పి పడిపోయింది. కంగారు పడ్డ కుటుంబ సభ్యులు వెంటనే డాక్టర్లను తీసుకొచ్చారు. పిచాయి చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. దీంతో తల్లీ తండ్రీ ఒకేసారి చనిపోవటంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. బందువులు..స్నేహితులు..స్థానికులు ఇలా వట్రివేల్‌, పిచాయి మృతితో విషాదంలో మునిగిపోయారు. ఆది దంపతులుగా భావించేవారు ఒకేసారి చనిపోవటం విషాదఛాయలు అలుముకున్నాయి.