ఢిల్లీలో రెడ్ అలర్ట్…ఉగ్రదాడులకు జైషే ప్లాన్

  • Published By: venkaiahnaidu ,Published On : October 3, 2019 / 06:07 AM IST
ఢిల్లీలో రెడ్ అలర్ట్…ఉగ్రదాడులకు జైషే ప్లాన్

జైషే మహ్మద్‌కు చెందిన నలుగురు అత్యంత ప్రేరేపిత ఉగ్రవాదులు ఢిల్లీలో వరుస దాడులకు పాల్పడే అవకాశముందని నిఘావర్గాల సమాచారం అందింది. దేశంలో ఆత్మాహుతి దాడులు చేసేందుకు పాకిస్తాన్ నుంచి మన దేశంలోకి జైషే మహ్మద్ ఉగ్రవాదులు దళాలుగా ఏర్పడి వేర్వేరు ప్రాంతాలకు వచ్చారని కేంద్ర నిఘా విభాగానికి సమాచారం అందింది.

ఇందులో భాగంగానే ఢిల్లీకి నలుగురు ఉగ్రవాదులు వచ్చారని, వారు ఏ క్షణమైనా దాడులు చేయవచ్చని నిఘావర్గాలు సమాచారంతో ఢిల్లీ పోలీసులు అలర్ట్ అయ్యారు. దేశ రాజధానిలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. బుధవారం జారీ అయిన హెచ్చరికలతో జమ్మూకశ్మీర్, అవంతిపూర్, పటాన్ కోట్, హిందన్ వైమానిక స్థావరాలతోపాటు దేశ రాజధాని నగరంలో కేంద్ర పారామిలటరీ బలగాల జవాన్లు, ఢిల్లీ పోలీసులు అలర్ట్ ప్రకటించారు.

ముందు జాగ్రత్తగా ఢిల్లీ ప్రధాన ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల్లో సాయుధ పోలీసు బలగాలను మోహరించారు. అనుమానమున్నవారిని ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. బుధవారం రాత్రి ఢిల్లీ పోలీస్ ప్రత్యేక విభాగం,ఇంటలిజెన్స్ కి చెందిన అధికారులు కలిసి సిటీలోని 9లొకేషన్స్ లో రైడ్స్ నిర్వహించారు. ఇద్దరు అనుమానితులని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.