Kashmiri Pandit: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల కాల్పులు.. ఒకరు మృతి
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు పౌరులను లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపారు. ఈ కాల్పుల ఘటనలో ఓ కశ్మీరీ పండిట్ మరణించాడు.
Kashmiri Pandit: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు పౌరులను లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపారు. ఈ కాల్పుల ఘటనలో ఓ కశ్మీరీ పండిట్ మరణించాడు. పుల్వామాలోని అచ్చన్ ప్రాంతానికి చెందిన కశ్మీరీ పండిట్ సంజయ్ శర్మ ఉదయం మార్కెట్కు వెళ్తున్న క్రమంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తీవ్రగాయాలతో సంజయ్ను ఆస్పత్రికి తరలించేలోపే మరణించాడు. సంజయ్ శర్మ స్థానిక బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నట్లు పోలీస్ అధికారి చెప్పారు.
ఘటన నేపథ్యంలో ఆప్రాంతంలో భయాందోళన నెలకొంది. దీంతో మైనార్టీలైన హిందువులున్న ఆ గ్రామంలో సాయుధ పోలీసులను మోహరించినట్లు పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపిన ఉగ్రవాదుల కోసం అదనపు బలగాల సహాయంతో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మరోవైపు ఉగ్రవాదులు ఇటీవలి కాలంలో స్థానిక పౌరులను లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరుపుతున్నారు. గత ఏడాది జమ్ముకశ్మీర్ లో వరుస హత్యలు జరిగాయి. ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన వారిలో చాలా మంది వలస కార్మికులు, కశ్మీరీ పండిట్లు ఉన్నారు.
తాజాగా ఘటనపై కశ్మీర్ డీఐజీ రయీస్ అహ్మద్ మాట్లాడుతూ.. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఉగ్రదాడి వెలుగులోకి వచ్చిందని తెలిపారు. సంజయ్ శర్మ తన భార్యతో కలిసి మార్కెట్ కు వెళ్తున్న క్రమంలో ఈ దాడికి గురైనట్లు డీఐజీ చెప్పారు. ఉగ్రవాదులకోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇదిలాఉంటే రెండురోజుల క్రితం జమ్మూ కశ్మీర్ లోని అనంత్ నాగ్ లో కూడా ఉగ్రవాదులు కాల్పులు జరిపరు. ఇందులో ఒక వ్యక్తికి గాయాలయ్యాయి.