Elon musk: ఇండియాలో టెస్లా కార్ల తయారీ కేంద్రం అసాధ్యమేనా? స్పష్టత ఇచ్చిన ఎలన్ మస్క్
ఇండియాలో టెస్లా కార్ల తయారీ కేంద్రం ఎప్పుడు వస్తుందనే దానిపై టెస్లా కంపెనీ సీఈవో ఎలన్ మస్క్ క్లారిటీ ఇచ్చారు. టెస్లా కార్ల తయారీ కేంద్రం ఏర్పాటుకు ఇప్పటికే కేంద్రం సముఖత వ్యక్తం చేసింది. తమ దేశంలో టెస్లా కార్ల తయారీ కేంద్రం పెట్టాలనిసైతం కేంద్రం కంపెనీ ప్రతినిధులను కోరింది.
Elon musk: ఇండియాలో టెస్లా కార్ల తయారీ కేంద్రం ఎప్పుడు వస్తుందనే దానిపై టెస్లా కంపెనీ సీఈవో ఎలన్ మస్క్ క్లారిటీ ఇచ్చారు. టెస్లా కార్ల తయారీ కేంద్రం ఏర్పాటుకు ఇప్పటికే కేంద్రం సముఖత వ్యక్తం చేసింది. తమ దేశంలో టెస్లా కార్ల తయారీ కేంద్రం పెట్టాలనిసైతం కేంద్రం కంపెనీ ప్రతినిధులను కోరింది. అయితే దేశంలో కార్ల తయారీ కేంద్రం ఏర్పాటుకు కంపెనీకి కేంద్రం కొన్నిషరతులు విధించిన విషయం విధితమే. అందుకు టెస్లా ప్రతినిధులు సుముఖత చూపలేదు. దీంతో ఇండియాలో కార్ల తయారీ కేంద్రం ఏర్పాటు ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా ఎలన్ మస్క్ చేసిన ట్వీట్ ప్రకారం చూస్తే.. రాబోయే కాలంలోనూ ఇండియాలో టెస్లా కార్ల తయారీ కేంద్రం ఏర్పాటు ఉండకపోవచ్చనే వాదనకు బలం చేకూరుతుంది.
ట్విటర్ ను కొనుగోలు చేసేందుకు సిద్ధమైన ఎలన్ మస్క్ నిత్యం ట్విటర్ లో పలు విషయాలను పంచుకుంటూ హడావిడి చేస్తున్నారు. నెటిజన్లు వేసిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు. ఈ క్రమంలో భారత్ లో టెస్లా కార్ల తయారీ కేంద్రాన్ని ఎప్పుడు ఏర్పాటు చేస్తున్నారంటూ ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నలకు మస్క్ సమాధానం ఇచ్చారు. ‘ముందు మా కార్లను విక్రయించేందుకు సర్వీసులు అందించేందుకు అనుమతులు లభించని ఏ ప్రాంతంలోనూ టెస్లా తయారీ కేంద్రంను నెలకొల్పబోదు’ అంటూ మస్క్ స్పష్టం చేశారు. నిజానికి భారత్ లో తమ కార్ల విక్రయాలు చేపట్టేందుకు టెస్లా కంపెనీ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం సైతం అనుమతి ఇచ్చింది. కానీ కొన్ని షరతులు విధించింది. ఇతర దేశాల్లో తయారు చేసిన కార్ల విక్రయాలు కాకుండా నేరుగా భారత్ లో టెస్లా కంపెనీ కార్ల తయారీ కేంద్రాన్ని నెలకొల్పాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. దానికి టెస్లా కంపెనీ ప్రతినిధులు నిరాకరించారు.
Tesla will not put a manufacturing plant in any location where we are not allowed first to sell & service cars
— Elon Musk (@elonmusk) May 27, 2022
తొలుత విదేశాల్లో తయారైన తమ కార్లను భారత్ లో విక్రయిస్తామని, తర్వాత స్థానికంగా కార్ల తయారీ కేంద్రం ఏర్పాటు చేస్తామని తెలిపారు. మేక్ ఇన్ ఇండియాకు ప్రాధాన్యత ఇస్తోన్న భారత ప్రభుత్వం అందుకు ఒప్పుకోక పోవడంతో టెస్లా కార్ల కంపెనీ తయారీ కేంద్రం ఏర్పాటు వాయిదా పడినట్లయింది. అయితే ఇటీవల కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సైతం టెస్లా కార్ల తయారీ కేంద్రాన్ని భారత్ లో ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. కానీ చైనాలో తయారైన కార్లను ఇక్కడ అమ్మనివ్వమని అన్నారు. ఈ నేపథ్యంలో మస్క్ తాజా ట్వీట్ తో టెస్లా, భారత్ మధ్య అగాధం పెరిగింది.