P Chidambaram : వ్యాక్సినేషన్ రికార్డు వెనుక అసలు రహస్యం ఇదే!

గత రెండు మూడు రోజులుగా దేశంలో రికార్డు స్థాయిలో ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్లను అందిస్తున్న విషయం తెలిసిందే.

P Chidambaram : వ్యాక్సినేషన్ రికార్డు వెనుక అసలు రహస్యం ఇదే!

Chidambaram (1)

P Chidambaram గత రెండు మూడు రోజులుగా దేశంలో రికార్డు స్థాయిలో ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్లను అందిస్తున్న విషయం తెలిసిందే. సోమవారం ఒక్క రోజే దేశవ్యాప్తంగా 88లక్షల మందికి వ్యాక్సిన్ ఇవ్వగా మంగళవారం 54.22లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. డిసెంబర్ చివరి నాటికి దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇస్తామని చెప్పిన నేపథ్యంలో కేంద్రం ఈ దూకుడిని ఇలాగే కొనసాగిస్తుందా లేదా అనే ప్రశ్నలు తలెత్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరం దీనిపై ట్విట్టర్ ద్వారా స్పందించారు.

సోమవారం రికార్డు స్థాయిలో వ్యాక్సిన్లు వేసి.. మరుసటి రోజే భారీగా పడిపోవడంపై చిదంబరం అసహనం వ్యక్తం చేశారు. ఆదివారం దాచెయ్, సోమవారం వేసెయ్, మంగళవారం చేతులెత్తేయ్ అంటూ కేంద్రం వ్యాక్సినేషన్ విధానంపై చిదంబరం వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ఒక్కరోజులో ఎక్కువ మందికి టీకాలు వేసి ప్రపంచ రికార్డు సృష్టించడం వెనక అదే అసలు రహస్యమని అన్నారు. గిన్నిస్ బుక్ రికార్డ్స్ లో కూడా ఈ ఫీట్ కు చోటు దక్కక తప్పదని చిదంబరం సెటైర్ వేశారు. మోదీ ప్రభుత్వానికి మెడిసిన్ లో నోబెల్ ప్రైజ్ ఇచ్చినా ఇస్తారు. ఎవరికి తెలుసు అని మరో కామెంట్ చేశారు. మోదీ ఉంటే ప్రతిదీ సంభవమే అన్న దానిని ‘మోదీ ఉన్న చోట అద్భుతాలే’గా మార్చుకోవాలన్నారు.

కాగా,కేంద్రం చెప్పినట్లు ఈ ఏడాది చివరినాటికి దేశంలోని పెద్దలందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలంటే రోజుకి 97లక్షల మందికి వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవసరముంటుంది.అయితే ప్రస్తుతమున్న వ్యాక్సిన్ సరఫరా పరిస్థితి నేపథ్యంలో కేంద్రం ఈ టార్గెట్ ను అందుకుంటుందా లేదా అన్న ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి.