Mobile Addiction : ద్యావుడా.. ఫోన్కు బానిసగా మారి గతం కూడా మర్చిపోయాడు
అతడు స్మార్ట్ విపరీతంగా అడిక్ట్ అయ్యాడు. ఎంతగా అంటే.. చివరికి గతాన్ని కూడా పూర్తిగా మర్చిపోయాడు. తీవ్ర మానసిక సమస్యతో కన్నతల్లిదండ్రులను కూడా గుర్తించలేని స్థితికి చేరుకున్నాడు.
Mobile Addiction : స్మార్ట్ ఫోన్.. ఇప్పుడు అందరి జీవితాల్లో ఓ భాగమైపోయింది. చిన్న పెద్ద, ధనిక పేద.. అనే తేడా లేదు. అందరి చేతుల్లోనూ స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది. చాలా పనులు ఫోన్ లోనే సులభంగానే జరిగిపోతున్నాయి. స్మార్ట్ ఫోన్ తో అదొక పెద్ద అడ్వాంటేజ్ గా చెప్పొచ్చు. ఇంకా చాలానే లాభాలున్నాయి. అయితే, ఏదైనా లిమిట్ లో ఉండాల్సిందే. హద్దు మీరితే.. భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు. ఓ యువకుడి విషయంలో ఇదే జరిగింది. అతడు స్మార్ట్ విపరీతంగా అడిక్ట్ అయ్యాడు. ఎంతగా అంటే.. చివరికి గతాన్ని కూడా పూర్తిగా మర్చిపోయాడు. తీవ్రమానసిక సమస్యతో కన్నతల్లిదండ్రులను కూడా గుర్తించ లేని స్థితికి చేరుకున్నాడు.
రాజస్తాన్లోని చూరు జిల్లాలోని సహ్వా టౌన్కు చెందిన 20 ఏళ్ల అక్రామ్ ఎలక్ట్రిక్ వైండింగ్ షాపును నిర్వహిస్తున్నాడు. నిత్యం వైండింగ్ పనులతో బిజీగా ఉండే అక్రామ్ హఠాత్తుగా స్మార్ట్ఫోన్కు బానిసైపోయాడు. గత నెల రోజులుగా పనికి కూడా వెళ్లకుండా స్మార్ట్ఫోన్తోనే కాలక్షేపం చేయడం మొదలుపెట్టాడు. గత కొన్ని రోజులుగా రాత్రీ, పగలు తేడా లేకుండా నిత్యం మొబైల్ ఫోన్లోనే కాలక్షేపం చేశాడు. తిండి తినడం, చివరికి నిద్రపోవడం కూడా మానేశాడు. అంతే.. అతడి పరిస్థితి సీరియస్ అయ్యింది. గతాన్ని మరిచిపోయాడు. కనీసం తల్లిదండ్రులను కూడా గుర్తుపట్టలేని స్థితిలోకి వెళ్లిపోయాడు. అతడి దుస్థితి చూసి ఆందోళన చెందిన కుటుంబసభ్యులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. భార్టియా ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులో చేర్పించారు. ప్రస్తుతం సైకియాట్రస్టులు అతడికి వైద్యం అందిస్తున్నారు.
Paytm Transit Card : పేటీఎం ఆల్ ఇన్-వన్ కార్డు.. అన్ని ట్రాన్సాక్షన్లకు ఒకే కార్డు!
గత నెల రోజులుగా అధిక సమయం మొబైల్తోనే గడుపుతున్నాడని కుటుంబసభ్యులు చెప్పారు. ఫోన్ చూడటంలో పడి చేస్తున్న పని కూడా మానేశాడని వాపోయారు. తాము ఎంత చెప్పినా మొబైల్ని చూడటం మాత్రం మానలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని రోజులుగా రాత్రంతా మొబైల్లో చాటింగ్ చేయడం లేదా గేమ్లు ఆడటం. తినడం, తాగటం, నిద్రపోవడం కూడా మానేశాడని కుటుంబసభ్యులు చెప్పారు. స్మార్ట్ ఫోన్ కి అడిక్ట్ అయిన యువకుడు చివరికి గతాన్ని కూడా మర్చిపోయిన ఘటన అందరినీ విస్మయానికి గురి చేస్తోంది.
స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చాక కొందరు తిండి నిద్రను మర్చిపోయి మరీ దాంతోనే కాలక్షేపం చేస్తున్నారు. సెల్కు బానిసలైపోతున్నారు. దీంతో లేనిపోని జబ్బుల బారిన పడుతున్నారు. స్మార్ట్ఫోన్ కు బానిసలైతే గతాన్ని కూడా మర్చిపోయే పరిస్థితి వస్తుందని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏదైనా లిమిట్ లో ఉండాలి, హద్దు మీరితే ఇబ్బందులు తప్పవన్నారు.