75th Independence Day: భారత ఆర్థిక వ్యవస్థను ఓ కుదుపు కుదిపిన పెద్దనోట్ల రద్దు.. ఇప్పుడంతా డిజిటల్ మయం..
2014 సంవత్సరంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది.. ఆ తరువాత రెండేళ్లకే కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 2016 నవంబర్ 8న అర్థరాత్రి రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.
75th Independence Day: 2014 సంవత్సరంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది.. ఆ తరువాత రెండేళ్లకే కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 2016 నవంబర్ 8న అర్థరాత్రి రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ నిర్ణయం 75ఏళ్ల స్వాతంత్ర భారతంలో దేశ ఆర్థిక వ్యవస్థలో ఓ పెద్ద కుదుపు అని చెప్పవచ్చు. పేద వాడి నుంచి ధనికుడి వరకు కేంద్రం తీసుకున్న నిర్ణయంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నప్పటికీ అవి ఏమాత్రం ఉపశమనం కలిగించలేదు. అయితే పెద్ద నోట్ల రద్దు వెనక ప్రధానంగా రెండు కారణాలున్నాయి.
అవినీతిపై పోరాడేందుకు, నల్లధనం సమస్యను పరిష్కరించేందుకు ఈ పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ పెద్దనోట్ల రద్దుతో దేశం కొత్త విధానంలోకి అడుగుపెట్టింది. అదేమిటంటే.. ఆన్లైన్ ట్రాన్సెక్షన్. పెద్ద నోట్ల రద్దు తరువాత ఆన్లైన్ చెల్లింపులపై కేంద్రంపై పెద్దఎత్తున ప్రచారం చేసింది. ఈ విషయంలో కేంద్రం విజయవంతం అయినట్లే చెప్పాలి. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోని ఏ చిన్న కిరాణం దుకాణంకు వెళ్లినా ఆన్లైన్ చెల్లింపుల విధానం అందుబాటులోకి వచ్చింది.
2016 సంవత్సరంలో పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాజకీయాల్లో కలకలం రేపింది. కొన్ని నెలల పాటు ప్రజా జీవనం స్తంభించిపోయింది. ఆరోజు జాతిని ఉద్దేశించి చేసిన ప్రత్యేక ప్రసంగంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పెద్దనోట్లు చెల్లవని ప్రకటించడంతో పాటు, కొత్త రూ.500, రూ. 2వేల నోట్లు చెలామణిలోకి తెస్తున్నట్లు వెల్లడించారు. ఉగ్రవాదులకు ఆర్ధిక వనరుగా మారిన దొంగనోట్ల మాఫియాను, దేశంలోని నల్లధనాన్ని నియంత్రించేందుకు నోట్లను రద్దు చేసినట్లు తెలిపారు. నోట్ల రద్దు ప్రకటన అనంతరం దేశవ్యాప్తంగా నవంబర్ 9, 10 తేదీలలో ఏటీఎంలను, అన్ని బ్యాంకులను మూసి ఉంచారు.
పాత పెద్దనోట్లను కొత్తవాటితో మార్చుకునేందుకు 2016 డిసెంబర్ 31 వరకు గడువు ఇచ్చారు. అనంతరం ఆ గడువును 2017 మార్చి 30 వరకు పొడిగించారు. ఆ సయయంలో పేదవర్గాల ప్రజల ఇబ్బందులు వర్ణణాతీతమనే చెప్పాలి. ఈ పెద్దనోట్ల రద్దు బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఆగ్రహాన్ని తెప్పించినప్పటికీ.. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 75ఏళ్ల స్వాతంత్ర భారతంలో పెద్దనోట్ల రద్దు ఎప్పుడూ గుర్తుండే పీడకల. అయితే ప్రస్తుతం డిజిటల్ చెల్లింపులు భారీగా పెరగడంతో పెద్దనోట్ల రద్దు కూడా ఓ విధంగా మంచేచేసినట్లయిందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.