సచిన్ పైలట్.. పార్టీ మీటింగ్కు రెండో సారి డుమ్మా
రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రెండో సారి పార్టీ మీటింగ్ కు హాజరుకాని రెబల్ లీడర్ సచిన్ పైలట్ ను ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించారు. సచిన్ పైలట్ బీజేపీతో కలిసి రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని పార్టీ చెబుతుంది. ముఖ్యమంత్రి నుంచి అందరూ పార్టీ మీటింగ్ కు సచిన్ హాజరుకావాలని అడిగినప్పటికీ తిరస్కరించి పార్టీ నుంచి బయటకు వచ్చేశారు.
మళ్లీ మళ్లీ మెసేజ్లు పంపి కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ జరుగుతున్నప్పుడల్లా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సచిన్ పైలట్ కు ఇంకా సమయముంది. పార్టీ లీడర్షిప్ అతని స్థానం గురించి ఇంకా ఫ్లెక్సిబుల్ గానే ఉంది. ఇవాల్టి మీటింగ్ తర్వాత నిర్ణయం ఫైనల్ చేస్తామని అన్నారు.
మంగళవారం ఉదయం రెండో కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (సీఎల్పీ) మీటింగ్ జరిగినా సచిన్ పైలట్, ఆయన వర్గం ఎమ్మెల్యేలు అటెండ్ అవలేదు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నేతృత్వంలో పనిచేయలేమని, సీఎం పదవి మార్పు జరగాల్సిందేనని సచిన్ కీలక డిమాండ్ వినిపించినట్లు సమాచారం. సీఎం వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు బస చేస్తున్న జైపూర్లోని ఫైర్మంట్ హోటల్లో మరోసారి సీఎల్పీ సమావేశం జరిగింది.
సీఎం క్యాంపులో 109 మంది ఎమ్మెల్యేలు లేరని, 22 మంది మిస్సింగ్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈక్రమంలోనే అశోక్ గెహ్లాట్ వెంట 87 మంది మాత్రమే ఉన్నారని పైలట్ వర్గం నేతలు చెప్తున్నారు. ప్రభుత్వం మైనారిటీలో ఉందని.. అశోక్ గెహ్లాట్కు బానిసత్వం చేయలేమని, సీఎంగా ఆయన తప్ప వేరేవరైనా సరేనని సచిన్ పైలట్ వర్గం నేతలు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది.