Amritpal Singh: మళ్లీ పైకి లేస్తోన్న ఖలిస్తానీ ఉద్యమం.. భింద్రన్వాలా 2.0గా అమృతపాల్ సింగ్!
1940లో సిక్కులకు ప్రత్యేక దేశం కావాలంటూ ఖలిస్తానీ ఉద్యమం ప్రారంభమైంది. ఖలిస్తాన్ అంటే ‘పవిత్రమైన భూమి’ అని పంజాబీలో అర్థం. తమకంటూ ఒక ప్రత్యేక మాతృభూమి కావాలనే డిమాండుతో ఇది లేచింది. అనేక సిక్కు సంఘాలు దీని కోసం పోరాటాలు చేశాయి. చాలా సార్లు హింస చెలరేగింది కూడా. ఇక అప్పటి నుంచి ఎన్నో మలుపులు తీసుకుంటూ 1970-80ల ప్రాంతంలో తీవ్ర స్థాయికి వెళ్లింది.
Amritpal Singh: ఖలిస్తానీ ఉద్యమం.. పంజాబీ ప్రాంతాన్ని ప్రత్యేక దేశంగా గుర్తించాలంటూ సాగుతోన్న ఉద్యమం. కొన్ని దశాబ్దాల క్రితం ఉదృతంగా సాగిన ఈ ఉద్యమం భింద్రన్వాలా మరణం అనంతరం చల్లబడింది. ఇక ఇందిరా గాంధీ హత్య అనంతరం జరిగిన సిక్కుల ఉచకోత తర్వాత పెద్దగా చర్చలో లేకుండా పోయింది. అప్పుడప్పుడు ఎక్కడో ఒకచోట ఖలిస్తాన్ నినాదాలో, సానుభూతిపరుల చర్యలో కనిపించినప్పటికీ అవంత పెద్దగా చెప్పుకునేవి అయితే కావు. ఇక పంజాబీ రాజకీయ పార్టీలు, నేతలు కూడా ఖలిస్తాన్ అంశాన్ని పక్కన పెట్టేశారు. మళ్లీ ఇంత కాలానికి ఈ నినాదం చర్చలోకి వచ్చింది. చర్చేనా.. ఈ ఉద్యమం మరోసారి బలపడుతున్నట్లుగానే కనిపిస్తోంది.
Earthquake In Indonesia : ఇండోనేషియాలో భూకంపం.. 6.3 తీవ్రత నమోదు
ప్రత్యేక ఖలిస్తాన్ దేశాన్ని కోరుకోవడం తప్పేంటని వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృతపాల్ అంటున్నారు. బహిరంగంగానే ప్రత్యేక ఖలిస్తాన్ నినాదాలు చేస్తున్నారు. దేశంలో ఇలా ఉంటే, కొద్ది రోజులుగా బయట దేశాల్లో కూడా ఖలిస్తానీల ఆగడాలు కనిపిస్తున్నాయి. కెనడా, ఆస్ట్రేలియా దేశాల్లో హిందూ దేవాలయాల మీద దాడులు చేసి ఖలిస్తానీ అనుకూల నినాదాలు రాశారు. ఇక భారత్ వ్యతిరేక నినాదాలు కూడా లేకపోలేదు. ఇక పంజాబ్ రాష్ట్రంలో ఆ వాతావరణం రోజురోజుకూ వేడెక్కుతోంది. ఖలిస్తానీ డిమాండును హిందూ రాష్ట్ర డిమాండుతో పోలుస్తూ కేంద్ర ప్రభుత్వం మీద విరుచుకుపడుతున్నారు.
తాజాగా పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ పట్టణంలో లవ్ప్రీత్ సింగ్ వురపు తూఫాన్ అనే వ్యక్తి అరెస్ట్ ఈ ఉద్యమాన్ని లైంలైట్లోకి తీసుకురావడానికి కారణమైందని చెప్పవచ్చు. కిడ్నాప్ కేసులో అరెస్టైన అతడు వారిస్ పంజాబ్ దే కార్యకర్త. అంతే కాకుండా ఆ సంస్థ అధినేత అమృతపాల్ సింగ్ ప్రధాన అనుచరుడు. అతడి అరెస్ట్ను నిరసిస్తూ కత్తులతో వందలాది మంది గురువారం అమృత్సర్ పట్టణంలోని అజ్నాలా పోలీస్ స్టేషన్లోకి చొరబడి హంగామా సృష్టించిన విషయం తెలిసిందే. దీని అనంతరం అమృతపాల్ మీడియాతో మాట్లాడుతూ ఖలిస్తానీ ఉద్యమాన్ని అడ్డుకుంటే ఇందిరాకు పట్టిన గతే అమిత్ షాకు పడుతుందంటూ బెదిరింపులు చేయడం గమనార్హం.
GHMC: 36 గంటల్లో 15,000.. కుక్కల బెడదపై జీహెచ్ఎంసీకి ఫిర్యాదుల వెల్లువ
అమృతపాల్ సింగ్ ఇంత బహిరంగంగా ఖలిస్తానీ అనుకూల నినాదాలు చేస్తున్నప్పటికీ పంజాబ్ ప్రభుత్వం నోరు మెదపడం లేదు. ఇతర పార్టీలు కూడా దీనిపై స్పందించడం లేదు. అమిత్ షాకు బహిరంగ బెదిరింపులు చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ, బీజేపీ నుంచి ఎలాంటి స్పందన ఇప్పటి వరకు రాకపోవడం గమనార్హం. రెండు, మూడు రోజులుగా ప్రత్యేక ఖలిస్తానీ డిమాండ్ మీద అమృతపాల్ సింగ్ గొంతు పెంచారు. ‘‘ప్రత్యేక ఖలిస్థాన్ దేశాన్ని తాము కోరుకుంటున్నాము. ఈ లక్ష్యం చెడ్డది కాదు. మా లక్ష్యాన్ని మేధోపరంగా చూడాలి. దీనివల్ల కలిగే భౌగోళిక రాజకీయ ప్రయోజనాల దృష్టితో చూడాలి. ఇది ఓ సిద్ధాంతం. సిద్ధాంతం ఎప్పుడూ చావదు. ఢిల్లీ (కేంద్ర ప్రభుత్వం) దీనిని ఇవ్వాలని మేము కోరుకోవడం లేదు’’ అన్నారు.
CWC: కాంగ్రెస్ పార్టీ సర్వోన్నత విభాగానికి ఎన్నికలు లేవు, సభ్యుల్ని అధ్యక్షుడు ఖర్గేనే నియమిస్తారట
ఇక అమృతపాల్ తనను తాను కరుడుగట్టిన ఖలిస్తానీ వేర్పాటువాది జర్నైల్ సింగ్ భింద్రన్వాలాతో పోల్చుకున్నట్లుగా కనిపిస్తోంది. అతడి వ్యవహార శైలి కూడా అలాగే కనిపిస్తోంది. సిక్కులు ప్రమాదంలో ఉన్నారని, బానిసలని ప్రచారం చేసి మతవిద్వేషాలను రెచ్చగొట్టడం మొదలుపెట్టాడు. చాలా మంది అతడు మతప్రచారం చేస్తున్నాడని భ్రమిస్తారు. అయితే మొదట్లో అమృత్పాల్ వ్యాఖ్యలు, చేష్టలపై ఎక్కువ వ్యతిరేకత ఉండేది. కానీ రోజులు గడుస్తున్నా కొద్ది అది తగ్గి, మద్దతు పెరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. మద్దతు ఇవ్వకపోయినా అమృతపాల్ రాడికల్ చర్యల వల్ల చాలా మంది వ్యతిరేకించడానికి భయపడి మౌనం పాటించాల్సి వస్తోంది.
అసలు ఎవరీ అమృపాల్ సింగ్?
ఏడాది క్రితం వరకు అమృతపాల్ ఎవరికీ తెలియదు. అందరిలాంటి ఓ సాధారణ వ్యక్తి. ఇప్పుడు నిండైన తలపాగాలో కనిపిస్తున్న అతడు, ఇంతకు ముందు తలపాగా కూడా ధరించేవాడు కాదు. చాలా రోజుల పాటు దుబాయ్లో నివసించారు. సింగర్ దీప్ సిద్ధూ స్థాపించిన వారిస్ పంజాబ్ దే సంస్థలో సభ్యుడు. అయితే దీప్ సిద్ధూ మరణం అమృతపాల్ జీవితాన్ని మార్చేసింది. సంస్థ అనుచరులకు మార్గనిర్దేశం చేసేవారు లేకపోవడాన్ని అవకాశంగా తీసుకున్న అమృతపాల్.. తనను తాను వారిస్ పంజాబ్ దే సంస్థ అధినేతగా ప్రకటించుకున్నారు. మొదట్లో సిద్ధూ కుటుంబీకులు ఇందుకు అంగీకరించలేదు. కానీ, అమృత్పాల్ అవన్నీ పట్టించుకోకుండా తన పని చేసుకుంటూ వెళ్లారు. క్రమంగా పంజాబ్లో పాపులర్ అయ్యారు.
Missed Call: 11 ఏళ్ల బాలిక మర్డర్ కేసులో నిందితుల్ని పట్టించిన మిస్డ్ కాల్
ఇక తాజాగా జరిగిన ఘటనతో మొత్తం దేశ వ్యాప్తంగా అమృతపాల్ పేరు మారుమోగిపోతోంది. తన అనుచరుడు లవ్ప్రీత్ తుఫాన్ అరెస్టును వ్యతిరేకిస్తూ వందల మంది కత్తులతో పోలీస్ స్టేషన్ మీదకు దాడికి వెళ్లడం దేశంలో సంచలనంగా మారింది. ఈ దాడికి పోలీసులే భయపడి తుఫాన్ విడుదలకు ఆదేశాలు జారీ చేశారంటే అక్కడ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక అమృతపాల్ తక్కువ కాలంలో ఇంత పెద్ద మొత్తంలో పాపులారిటీని మద్దతును స్వీకరించడానికి కారణం, అతడు పంజాబ్ కేంద్రంగా ఖలిస్తానీ డిమాండ్కు అనుగుణంగా కార్యకలాపాలు నిర్వహిస్తుండడం. ఇది పంజాబ్ రాష్ట్రంలో ఉన్న ఖలిస్తానీ సానుభూతిపరులను ఆకర్షించి, ఆయనకు మద్దతుదారులుగా తయారు చేసింది.
భింద్రన్వాలా 2.0 గా అమృతపాల్
జర్నైల్ సింగ్ భింద్రన్వాలా తరహాలోనే అమృపాల్ సింగ్ వ్యవహరిస్తున్నారనే బలమైన విమర్శ అమృతపాల్ మీద ఉంది. అతడి వస్త్రధారణ, వ్యవహారశైలి, మాట తీరు అలాగే ఉంటున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం, దేశానికి వ్యతిరేకంగా వ్యవహరించడంలో భింద్రన్వాలాను కాపీ కొట్టినట్లు కనిపిస్తోంది. ఇక అప్పట్లో అమృత్సర్ పట్టణంలోని స్వర్ణదేవాలయాన్ని కేంద్రంగా చేసుకుని సమాంతర ప్రభుత్వాన్ని నడిపే ప్రయత్నం చేశారు భింద్రన్వాలా. ఇప్పుడు అమృతపాల్ సైతం స్వర్ణదేవాలయం కేంద్రంగానే కార్యకలాపాలు నిర్వహించాలని చూస్తున్నారు. తుఫాన్ విడుదల కాగానే అతడిని స్వర్ణదేవాలయానికి తీసుకెళ్తానని ప్రకటించారు.
Nijam with Smitha : చిన్నతనంలో ఇంటి నుంచి పారిపోయిన హీరో నాని ఫాదర్.. పట్టించిన అగ్ర నిర్మాత కూతురు!
అయితే భింద్రన్వాలాతో పోలిక గురించి అమృతపాల్ను ప్రశ్నిస్తే.. ఇది తన సాధారణ వ్యక్తిగత జీవితమని, తాను ఇలాగే ఉంటానని అన్నారు. ఇక గురువారం నాటి హింసపై ప్రశ్నించగా యంత్రాంగానికి తాము సమయం, అవకాశం ఇచ్చామని.. అయితే తమకు హింస తప్ప వేరే అవకాశం ఇవ్వలేదని చెప్పారు. ‘‘మేము హింసను ఎంచుకున్నాము. హా.. హింస మనల్ని మరింతగా దెబ్బతీస్తుందని నాక్కూడా తెలుసు. దీనిపై నేను ఎలాంటి భ్రమల్లో లేను కూడా. కానీ వాళ్ళు మమ్మల్ని చంపమని నేను ఇక్కడే కూర్చోలేను కదా” అని అన్నారు.
1940లో సిక్కులకు ప్రత్యేక దేశం కావాలంటూ ఖలిస్తానీ ఉద్యమం ప్రారంభమైంది. ఖలిస్తాన్ అంటే ‘పవిత్రమైన భూమి’ అని పంజాబీలో అర్థం. తమకంటూ ఒక ప్రత్యేక మాతృభూమి కావాలనే డిమాండుతో ఇది లేచింది. అనేక సిక్కు సంఘాలు దీని కోసం పోరాటాలు చేశాయి. చాలా సార్లు హింస చెలరేగింది కూడా. ఇక అప్పటి నుంచి ఎన్నో మలుపులు తీసుకుంటూ 1970-80ల ప్రాంతంలో తీవ్ర స్థాయికి వెళ్లింది. కరుడుగట్టిన ఖలిస్తానీ నేత జర్నైల్ సింగ్ భింద్రన్వాలా.. అమృత్సర్ పట్టణంలోని స్వర్ణదేవాలయం కేంద్రం సమాంతర ప్రభుత్వాన్ని నడిపే ప్రయత్నం చేశాడు. అక్కడి నుంచే అన్ని సెటిల్మెంట్లు చేసేవాడు.
Meghalaya Polls: కమల వికాసం, సమాధి నిర్మాణం.. మేఘాలయలో ముగిసిన మోదీ ఎన్నికల సభ
అయితే 1984 జూన్ 1 నుంచి 10 వరకు జరిగిన ఆపరేషన్ బ్లూ స్టార్లో భాగంగా.. గోల్డెన్ టెంపులో నక్కిన ఖలిస్తానీ ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది. ఇందులో భాగంగా జూన్ 6న జవాన్ల ఎదురుకాల్పుల్లో ఖలిస్తానీ ఉగ్రవాద నాయకుడు భింద్రన్వాలా హతమయ్యాడు. ఈ ఘటన అనంతరం ప్రధానమంత్రి ఇందిరా గాంధీని ఆమె అనుచరుల్లో భాగంగా ఉన్న ఖలిస్తానీ సానుభూతిపరులు మట్టుబెట్టారు. దీనికి ప్రతిగా సిక్కులపై మారణహోమం జరిగింది. ఆ తర్వాత ఖలిస్తానీ ఉద్యమం చల్లబడింది. మళ్లీ ఇన్నాళ్లకు లేచినట్టే కనిపిస్తోంది. అయితే ఇది ఎంత వరకు వెళ్తుందనేది చూడాలి.