Maharashtra Politics : అప్పుడు రాజ్‌ ఠాక్రే..ఇప్పుడు ఏక్‌నాథ్ షిండే..అసలు శివసేనలో తిరుగుబాట్లు ఎందుకొస్తున్నాయ్..?

బీజేపీతో పొత్తు పెట్టుకుంటేనే తిరిగి వస్తానని షిండే అంటున్నారు.. దిగిపోవడానికైనా సిద్ధమే కానీ.. తగ్గేదే లేదు అంటున్న ఠాక్రే కుటుంబం. మహారాష్ట్ర రాజకీయాల్లో మరి ఇప్పుడేం జరగబోతోంది.. ఏక్‌నాథ్ షిండే అడుగులు ఎలా ఉండబోతున్నాయ్.. ఇకపై ఆయన ఏం చేయబోతున్నారు. తనతో పాటు కలిసి వచ్చిన ఎమ్మెల్యేలతో.. ఎలాంటి వ్యూహాలు అమలు చేసే అవకాశాలు ఉన్నాయ్ ? అప్పుడు రాజ్‌ ఠాక్రే నుంచి ఇప్పుడు ఏక్‌నాథ్ షిండే వరకు.. అసలు శివసేనలో ఎందుకు తిరుగుబాట్లు కనిపిస్తున్నాయ్..?

Maharashtra Politics : అప్పుడు రాజ్‌ ఠాక్రే..ఇప్పుడు ఏక్‌నాథ్ షిండే..అసలు శివసేనలో తిరుగుబాట్లు ఎందుకొస్తున్నాయ్..?

Maharashtra Politics

Maharashtra Politics : బీజేపీతో పొత్తు పెట్టుకుంటేనే తిరిగి వస్తానని షిండే అంటున్నారు.. దిగిపోవడానికైనా సిద్ధమే కానీ.. తగ్గేదే లేదు అని ఠాక్రే కుటుంబం అంటోంది. మరి ఇప్పుడేం జరగబోతోంది.. ఏక్‌నాథ్ షిండే అడుగులు ఎలా ఉండబోతున్నాయ్.. ఇకపై ఆయన ఏం చేయబోతున్నారు. తనతో పాటు కలిసి వచ్చిన ఎమ్మెల్యేలతో.. ఎలాంటి వ్యూహాలు అమలు చేసే అవకాశాలు ఉన్నాయ్ ? అప్పుడు రాజ్‌ ఠాక్రే నుంచి ఇప్పుడు ఏక్‌నాథ్ షిండే వరకు.. అసలు శివసేనలో ఎందుకు తిరుగుబాట్లు కనిపిస్తున్నాయ్..

శివసేన అంటేనే.. కరుడుగట్టిన హిందూత్వానికి కేరాఫ్. ఐతే ఆ సిద్ధాంతాలను పక్కనపెట్టి.. కాంగ్రెస్‌, ఎన్సీపీతో పొత్తుతో.. పార్టీ విలువలు పక్కపెడుతున్నారన్న షిండే ఆరోపణ. శివసేన పార్టీ క్రమశిక్షణకు మారు పేరు. ఐనా సరే.. పార్టీలో తిరుగుబాట్లు కనిపిస్తూనే ఉంటాయ్. పార్టీ స్థాపించిన తర్వాత నుంచి ఇప్పటివరకు అదే ఫార్ములా కంటిన్యూ అవుతోంది. పార్టీలో క్రమక్రమంగా ఎదిగి… అధినేత తర్వాతి స్థాయి వరకు చేరుకున్న నేతల్లో చాలామంది రెబెల్స్‌గా మారి కొందరు ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకుని తిరుగుబాటు జెండా ఎగరేశారు. ఛగడన్ భుజ్‌బల్ నుంచి రాజ్ ఠాక్రే.. ఇప్పుడు ఏక్ నాథ్ షిండే దాకా.. సేమ్‌ సీన్ రిపీట్ అయింది. ప్రత్యక్ష పదవి చేపట్టకూడదని శివసేన వ్యవస్థాపకుడు బాల్‌థాక్రే నియమం పెట్టుకున్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆయన సీఎం పదవి ఏనాడూ చేపట్టలేదు. తమ పార్టీలోని ఇతరులకే అవకాశం ఇచ్చారు. ఐతే బీజేపీ తెగదెంపుల తర్వాత ఆ నియమానికి కూడా నీళ్లు వదిలారు. అదే ఇప్పుడు షిండే తిరుగుబాటుకు కారణం అయింది.

Also read : Eknath Shinde : ఎవరీ ఏక్‌నాథ్ షిండే..? రిక్షా, టెంపో డ్రైవర్‌ నుంచి..‘మహా’రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే స్థాయికి ఎలా చేరుకున్నారంటే..!

శివసేనకు మొదటి పెద్ద ఎదురుదెబ్బ 2005లో తగిలింది. బాల్‌ ఠాక్రే సోదరుడి కుమారుడైన రాజ్‌ ఠాక్రే… ఆ పార్టీని వీడి మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన పేరుతో సొంత కుంపటి పెట్టుకున్నారు. శివసేనలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని… రాజ్‌ విమర్శలు గుప్పించడంతోపాటు ఉద్ధవ్‌ ఠాక్రేపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో 13సీట్లు గెలుచుకుని ప్రభావం చూపిన MNS… ఆ తర్వాత క్రమంగా ఆదరణ కోల్పోయింది. 2019 ఎన్నికల్లో ఒక్క సీటుకే పరిమితం అయింది. ఇక ఆ తర్వాత నారాయణ్‌ రాణె రూపంలో శివసేనకు మరో షాక్ తగిలింది. బీజేపీ, శివసేన తొలిసారిగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు… 1999లో 8నెలలు ఆయన సీఎంగా పనిచేశారు. ఐతే 2003లో ఉద్ధవ్‌ను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రకటించినప్పటి నుంచి ఆయన అసమ్మతి స్వరం వినిపించారు. పార్టీ టికెట్లు, పదవులను అమ్ముకుంటున్నారంటూ ఆరోపణలు చేయడం కలకలం రేపింది. దీంతో 2005లో ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో ఆయన కొంతమంది ఎమ్మెల్యేలతో కలసి మొదట కాంగ్రెస్‌లో చేరారు. ఆ తర్వాత మహారాష్ట్ర స్వాభిమాన్‌ పక్ష్ పేరుతో సొంత పార్టీ పెట్టారు. 2019లో దాన్ని బీజేపీలో విలీనం చేశారు.

రాజ్‌ఠాక్రే, శివనారాయణ్ రాణెలాంటి వాళ్లు అసంతృప్తులు, ఆరోపణలతో పార్టీకి దూరం కాగా.. ఛగన్‌ భుజ్‌బల్‌ రూపంలో.. శివసేనలో మొదటిసారి తిరుగుబాటు కనిపించింది. ఎన్సీపీలో ఉన్న భుజ్‌బల్‌.. ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్నారు. శివసేన ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కొనసాగుతూ… బాల్‌ ఠాక్రేకు భుజ్‌బల్‌ సన్నిహితనేతగా మెలిగారు. ఐతే 1991లో ఆయన ప్లేటు ఫిరాయించారు. శాసనసభలో ప్రతిపక్షనేతగా మనోహర్‌ జోషిని నియమించడంపై భుజ్‌బల్‌ అభ్యంతంర వ్యక్తం చేశారు. అదే ఏడాది డిసెంబరులో తన వర్గంలోని ఎమ్మెల్యేలతో కలసి కాంగ్రెస్‌లో చేరారు. తర్వాత పరిణామాల్లో శరద్‌ పవార్‌ కాంగ్రెస్‌ను వీడి నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీని ఏర్పాటు చేయడంతో భుజ్‌బల్‌ కూడా ఆయన వెంటే నడిచారు.

Also read : DHFL Scam : దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ స్కామ్..DHFL​లో​ రూ.34,615 కోట్ల అవినీతి

బాల్‌ఠాక్రే మరణం తర్వాత.. వరుస వివాదాలు శివసేనను ముంచెత్తుతూనే ఉన్నాయ్. ఇప్పుడు ఏక్‌నాథ్ షిండే దగ్గర ఆగింది. తనకు 46మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని షిండే అంటున్నా.. నిజంగా ఎంతమంది ఉన్నారన్న దానిపై ఇప్పటికీ క్లారిటీ లేదు. ఐతే ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలతో కలిసి ఏక్‌నాథ్‌ షిండే ఏం చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తప్ప.. తిరిగి వచ్చేది లేదని అంటున్న షిండే.. అలా జరగకపోతే.. ఎలాంటి అడుగులు వేస్తారన్న చర్చ నడుస్తోంది. కొత్త పార్టీ ఏర్పాటు చేస్తారా.. లేదంటే తనతో పాటు వచ్చిన ఎమ్మెల్యేలతో కలిసి.. కమలం తీర్థం పుచ్చుకుంటారా అన్న చర్చ రాజకీయవర్గాల్లో నడుస్తోంది. ఏం చేసినా.. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. మహారాష్ట్ర సర్కార్‌ ఇప్పుడు ప్రమాదం అంచున నిలిచినట్లే లెక్క !

ప్రస్తుతం మహారాష్ట్రలో అసెంబ్లీ రద్దయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయ్. మహారాష్ట్రలో శాసనసభ రద్దు దిశగా రాజకీయ పరిణామాలు ఉన్నాయంటూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చేసిన ట్వీట్.. ఈ వార్తలకు బలం ఇచ్చినట్లు అవుతోంది. ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్యా ఠాక్రే కూడా తన ట్విట్టర్ అకౌంట్‌లో మినిస్టర్‌ అని తీసివేయడం.. ఈ చర్చకు మరింత బలాన్ని అందిస్తోంది. ఏమైనా మహారాష్ట్ర పరిణామాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా కొత్త చర్చకు దారి తీస్తున్నాయ్. రాష్ట్రపతి ఎన్నికల వేళ జరుగుతున్న పరిణామాలు.. కొత్త ఆసక్తి రేకెత్తిస్తున్నాయ్.