బ్యాంకు ఉద్యోగులకు భరోసా…ఎవ్వరినీ ఉద్యోగంలోంచి తొలగించం
ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనంతో ఉద్యోగాలు పోతాయని బ్యాంకు ఉద్యోగులు భయపడాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భరోసా ఇచ్చారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనంతో ఏ ఒక్కరినీ ఉద్యోగంలోంచి తొలగించబోమని ఆమె చెప్పారు. 27 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసి 12 పటిష్ట బ్యాంకులుగా మార్చే ప్రక్రియలో భాగంగానే ఈ విలీన ప్రక్రియ అని నిర్మలా సీతారామన్ అన్నారు.
ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగాలకు ముప్పు వాటిల్లడంతో పాటు బ్యాంకుల మూసివేతకు ఇది దారితీస్తుందని బ్యాంకు ఉద్యోగుల యూనియన్ ఆందోళన వ్యక్తం చేసింది. కాగా, బ్యాంకుల విలీనంతో ఉద్యోగాలకు ఎసరు వస్తుందన్న వాదనను నిర్మలా సీతారామన్ కొట్టిపారేశారు.
బ్యాంకుల విలీనంపై తాను శుక్రవారం (ఆగస్టు 30, 2019) ప్రకటన చేసిన సమయంలో ఏ ఒక్క బ్యాంకు ఉద్యోగినీ విధుల నుంచి తొలగించబోమని విస్పష్టంగా పేర్కొన్న విషయం గమనించాలని ఆమె కోరారు. పాలనా సంస్కరణల ఊతంతో 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ను మలిచేందుకు పీఎస్యూ బ్యాంకుల విలీనం ద్వారా మార్గం సుగమం అవుతుందని ప్రభుత్వం చెబుతోంది.