ఇంట్లో దొంగతనం : రూ. కోటి ఖర్చుతో సొరంగం తవ్వారు..వెండిపెట్టే చోరీ చేశారు..అందులో ఏముంది ?
steal box : దోపిడీకి దొంగలు అనేక మార్గాలు ఎంచుకుంటున్నారు. కొందరు రాత్రులు తలుపులు, గోడలను బద్దలు కొట్టి దొంగతనాలు చేస్తే.. మరికొందరు పగలే తుపాకులతో బెదిరించి దోపిడీలకు పాల్పడతారు. జైపూర్లోని దొంగలు మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. అక్కడ దొంగలు ఓ ఇంటిని దోచుకునేందుకు సొరంగమే తవ్వారు. హాలీవుడ్ క్రైమ్ స్టోరీని తలపిస్తున్న ఈ చోరీకి దొంగలు కోటి రూపాయలపైనే ఖర్చు పెట్టారు. అంతా ఖర్చు పెట్టి దొంగలు దోచుకెళ్లింది ఓ వెండి పెట్టెను మాత్రమే. అయితే, ఓ వెండి పెట్టెను దొంగిలించేందుకు అంత ఖర్చు పెట్టి మూడు నెలలు ఎందుకు శ్రమించారు?.
రాజస్థాన్ రాజధాని జైపూర్లో జరిగిన దొంగతనం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. స్థానికంగా వైశాలినగర్లో నివాసముంటున్న డాక్టర్ సునీత్ సోని.. తన ఇంట్లో వెండి పెట్టె దొంగిలించారని ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు.. పక్కనే ఉన్న స్థలంలో నుంచి ఓ సొరంగాన్ని తవ్వి.. దొంగలు ఇంట్లోకి ఎంటర్ అయినట్టు గుర్తించారు. డాక్టర్ బంగ్లా ప్రక్కనే ఉన్న స్థలాన్ని గుర్తు తెలియని వ్యక్తులు.. మూడు నెలల క్రితమే 90 లక్షల రూపాయలకు కొన్నారు. అక్కడి నుంచి సొరంగం తవ్వి.. దాని ద్వారా వెండిపెట్టెను ఎత్తుకెళ్లారు.
హాలీవుడ్ సినిమా రేంజ్లో ఉన్న ఈ క్రైమ్ స్టోరీలో.. అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. దొంగలు సొరంగం తవ్వి దోచుకెళ్లింది ఒక్క వెండి పెట్టెను. అందుకోసం స్థలానికి మాత్రమే 90 లక్షల రూపాయలను ఖర్చు చేశారు. సొరంగం తవ్వడానికి ఇంకొంత ఖర్చు పెట్టారు. కానీ, వాళ్లు ఎత్తుకెళ్లింది వెండి పెట్టె మాత్రమే. పెట్టిన ఖర్చుతో వెండి పెద్ద బోశానాన్నే కొనవచ్చు. కానీ.. దొంగలు ఆ వెండిపెట్టనే ఎందుకు ఎత్తుకెళ్లారనేది కోటి రూపాయల ప్రశ్న. ఇంటి ఓనరైన డాక్టర్ కానీ.. పోలీసులు కానీ.. వెండి పెట్టెలో ఏముందో చెప్పడం లేదు. దీంతో దానిపైనే అనేక సందేహాలు కలుగుతున్నాయి.
వెండిపెట్టెలో ఏమైనా వజ్రాలున్నాయా? లేక అంతకంటే విలువైన పురాతన వస్తువులున్నాయా? అని స్థానికులు గుసగులాడుతున్నారు. పెట్టె ఎత్తుకెళ్లిన వాళ్లకు ఏముందో ముందే తెలుసని పోలీసులు చెప్పడం కూడా.. పెట్టెలో ఏముందనే దానిపై సర్వత్రా ఆసక్తిని పెంచుతోంది. ఇప్పుడు జైపూర్ అంతా ఆ వెండి పెట్టె గురించే మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనా.. పెట్టెలో ఉండే రహస్యం తెలియాలంటే.. దొంగలు దొరకాల్సిందేనంటున్నారు.