CAA : అప్ఘాన్ పరిస్థితి చూశారు కదా..అందుకే సీఏఏ అవసరం
మన అస్థిరమైన పొరుగుదేశంలో(అప్ఘానిస్తాన్)ప్రస్తుతం సిక్కులు, హిందువులు ఎదర్కొంటున్న అత్యంత దయనీయ పరిస్థితులను చూసినప్పుడే పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలు కచ్చితంగా
CAA మన అస్థిరమైన పొరుగుదేశంలో(అప్ఘానిస్తాన్)ప్రస్తుతం సిక్కులు, హిందువులు ఎదర్కొంటున్న అత్యంత దయనీయ పరిస్థితులను చూసినప్పుడే పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలు కచ్చితంగా అవసరమన్న విషయం తెలుస్తుందని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు.
సీఏఏ అమలు అవసరం ఏంటన్నది ప్రస్తుతం అప్ఘానిస్తాన్ లో జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలిసేలా చేశాయని ఆదివారం చేసిన ఓ ట్వీట్ లో హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. ఆదివారం ఉదయం అప్ఘానిస్తాన్ రాజధాని కాబూల్ నుంచి 168 మందిని ఇండియన్ ఎయిర్ఫోర్స్ విమానం ఢిల్లీకి చేర్చిన నేపథ్యంలో దానికి సంబంధించిన వార్తను కోట్ చేస్తూ ఆయన ట్వీట్ చేశారు.
కాగా, 2019, డిసెంబర్ 11న భారత పార్లమెంట్ పౌరసత్వ సవరణ చట్టానికి(CAA) ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ సవరణ ప్రకారం.. 2014, డిసెంబర్ కంటే ముందు మన పొరుగు దేశాలైన అఫ్ఘానిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ల నుంచి వచ్చే హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు లేదా క్రిస్టియన్లకు భారత పౌరసత్వం ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ముస్లింలకు మాత్రం ఇందులో చోటు కల్పించకపోవడంపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. సీఏఏకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. సీఏఏ వ్యతిరేక ఆందోళనకారులపై పోలీసులు జరిపిన కాల్పులు, ఆందోళనలతో తలెత్తిన హింసతో దాదాపు 100 మంది మరణించారు.
ఈ చట్టం మతపరమైన వివక్షతో చేశారంటూ కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. అన్ని మతాలను సమానంగా చూడాలని.. పొరుగు దేశాల్లో ఉండలేక వచ్చేసే ముస్లింలకు కూడా ఇక్కడ పౌరసత్వం ఇచ్చేలా సవరణ చేయాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేశారు. అయితే పొరుగున ఉన్న మూడు దేశాలు మస్లిం దేశాలుగా ప్రకటించుకున్నవేనని.. అక్కడ మైనార్టీలైన హిందువులు, సిక్కులు, క్రిస్టియన్లు,జైనులు,పార్శీలు,బౌద్ధులు మతపరమైన హింసకు గురవుతున్నారని, వారికి ఆశ్రయం కల్పించేందుకే సీఏఏ తీసుకొచ్చామని కేంద్ర ప్రభుత్వం చెబుతూ వస్తోంది.