CM Arvind Kejriwal: నా దమ్మేంటో నిరూపిస్తా.. నేడు ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్న కేజ్రీవాల్!
CM Arvind Kejriwal: ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నేడు అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని తీసుకొచ్చేందుకు ఆయన నిర్ణయించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో బీజేపీ విఫలమైందని ఢిల్లీ వాసులకు నిరూపించేందుకు సభలో విశ్వాస తీర్మానం తీసుకువస్తానని అన్నారు.
Arvind Kejriwal: కాశ్మీర్పై రాజకీయాలు చేయడమే బీజేపీకి తెలుసు: అరవింద్ కేజ్రీవాల్
బీజేపీ నేతలు మాత్రం కేజ్రీవాల్ వాదనలను కొట్టిపారేస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో సీబీఐ దర్యాప్తులో ఉన్న ఎక్సైజ్ పాలసీపై ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దృష్టి మరల్చడానికి ఢిల్లీ అధికార పార్టీ డ్రామాలు ఆడుతుందని విమర్శించారు. లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ పీడీటీ ఆచారి ఈ విషయంపై మాట్లాడుతూ.. సాధారణంగా సభలో అధికార పక్షం మెజారిటీ కోల్పోయిందని భావించినప్పుడు ప్రతిపక్షాలు సభలో ‘అవిశ్వాస’ తీర్మానాన్ని తీసుకువస్తాయని, కానీ, అధికార పక్షం కూడా సభలో విశ్వాస తీర్మానం తీసుకురావచ్చని చెప్పారు. హౌస్ లో మొత్తం 70 మంది సభ్యులలో ఆప్కు 62 మంది ఉన్నారని, సులభంగా విశ్వాస తీర్మానాన్ని నెగ్గుతుందని అన్నారు.
ఇదిలాఉంటే సోమవారం ఉదయం 11గంటలకు ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశం ప్రారంభంలోనే ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి గదుల నిర్మాణంలో అవినీతి జరిగిందని బీజేపీ ఆరోపించింది. ఈ అంశంపై అసెంబ్లీలో చర్చ జరగాలని ఆ పార్టీ నేతలు పట్టుబట్టారు. ఈ క్రమంలో ఆప్, బీజేపీ సభ్యుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. గందరగోళం, నిరసనల మధ్య అసెంబ్లీలోని పలువురు ప్రతిపక్ష నేతలు సభనుంచి సస్పెండ్ అయ్యారు. మరోవైపు నేడు సీఎం అరవింద్ కేజ్రీవాల్ అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు.