ఎవరైతే ఏంటీ : ట్రాఫిక్ రూల్స్ బ్రేక్..ప్రియాంక గాంధీకి ఫైన్
కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీకి పోలీసులు ఫైన్ విధించారు. ప్రమాదకరంగా బండి నడిపినందుకు, అలాగే..రహదారి భద్రత నియమాలను ఉల్లంఘించారంటూ..ఈ జరిమాన విధించారు. ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్న ప్రియాంక, పార్టీ నేత ధీరజ్ గుర్జార్కు రూ. 6 వేల 100 విధించారు. దీనికి సంబంధించిన చలానాను ద్విచక్ర యజమాని అయిన రాజ్ దీప్ సింగ్కు పంపించారు. అసలు ఎందుకా ఫైన్ విధించినట్లు..బండిపై ప్రియాంక గాంధీ ఎందుకు వెళ్లినట్లు..
కేంద్ర ప్రభుత్వం CAAపై తీసుకున్న నిర్ణయంపై దేశ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు పెల్లుబికుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా యూపీలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. పలువురు మరణించారు. ఘర్షణలకు కారకులయ్యారంటూ ఎంతో మందిని పోలీసులు అరెస్టు చేశారు. నిరసనల్లో అరెస్టు అయిన వారిలో విశ్రాంత ఐపీఎస్ అధికారి దారాపురి కుటుంబం ఉంది. వీరు లక్నోలో నివాసం ఉంటున్నారు. వీరిని పరామర్శించాలని ప్రియాంక భావించి లక్నోకు చేరుకున్నారు.
కానీ ఆమె ప్రయాణిస్తున్న వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తనను మెడ, గొంతు పట్టుకున్నారంటూ ప్రియాంక ఆరోపణలు చేశారు. అనంతరం పోలీసుల కళ్లు గప్పి..పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే..ధీరజ్ గుర్జార్తో కలిసి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. దీనికి సంబంధించిన దృశ్యాలు వీడియోల ద్వారా వైరల్ అయ్యాయి. వీటిని ఆధారం చేసుకుని ట్రాఫిక్ ఎస్పీ పూర్ణేందు సింగ్ జరిమాన విధించారు.
దేనికంత విధించారంటే : –
* డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడిపినందుకు రూ. 2 వేల 500.
* ఇద్దరు హెల్మెట్లు ధరించనందుకు రూ. 500.
* ట్రాఫిక్ నిబంధనలు పాటించనందుకు రూ. 300.
* తప్పుడు నెంబర్ ప్లేట్ ఉన్నందుకు రూ. 300.
* నిర్లక్ష్యంగా నడిపినందుకు రూ. 2 వేల 500
– మొత్తం రూ. 6 వేల 100.