పెరిగిన రైల్వే చార్జీలు.. నేటి నుంచి అమల్లోకి
దేశవ్యాప్తంగా నేటి(01 జనవరి 2020) నుంచి రైల్వే ఛార్జీలు పెంచింది రైల్వేశాఖ. కొత్త సంవత్సరం ప్రవేశిస్తున్న వేళ.. వివిధ ప్యాసింజర్ రైళ్లకు కిలోమీటరుకు కనీసం 4 పైసలు పెంచుతున్నట్లు రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయల్ ప్రకటన చేశారు. ఈ పెంపు 2020 జనవరి 1న ప్రారంభమైన మరుక్షణం నుంచే అమల్లోకి వచ్చింది. సాధారణ నాన్ ఏసీ రైళ్లకు ఈ చార్జీలు కిలోమీటరకు ఒక పైసా పెరగనుండగా.. నాన్ ఏసీ మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లకు కిలోమీటరుకు 2 పైసల చొప్పున పెరుగుతున్నాయి.
ఇవాళ నుంచి ఏసీ తరగతులకు కిలోమీటరుకు 4 పైసల చొప్పున పెరుగుతున్నట్లు రైల్వే వర్గాలు ప్రకటనలో తెలిపాయి. సబర్బన్ రైళ్లు మినహా రాజధాని, శతాబ్ది, దురంతో, వందేభారత్, తేజస్, హమ్ సఫర్, మహామన, గతిమాన్, గరీబ్రథ్, అంత్యోదయ, జనశతాబ్ది తదితర రైళ్లన్నింటికీ ఈ చార్జీల పెంపు వర్తిస్తుంది.
అయితే జనవరి 1కి కన్నా ముందు బుక్ చేసుకున్న టికెట్లకు ఈ పెంపు వర్తించదు. దీంతోపాటు రిజర్వేషన్ ఫీజు, సూపర్ఫాస్ట్ చార్జీల్లో కూడా ఎటువంటి మార్పు ఉండబోదు. రైల్వే చార్జీలను 2014-15లో సవరించగా, నిర్వహణ ఖర్చులు పెరగడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే బోర్డు చైర్మన్ వినోద్కుమార్ యాదవ్ వెల్లడించారు.