Aisha Sultana: ఫిల్మ్మేకర్పై దేశద్రోహం కేసు నమోదు
లక్షద్వీవ్ కొత్త పాలనాధికారి ప్రఫుల్ ఖోడా పటేల్ లక్షద్వీప్ డెవలప్మెంట్ అథారిటీ రెగ్యులేషన్ (2021)ను తీసుకురావడాన్ని అక్కడి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
Aisha Sultana: లక్షద్వీప్ కొత్త పాలనాధికారి ప్రఫుల్ ఖోడా పటేల్ లక్షద్వీప్ డెవలప్మెంట్ అథారిటీ రెగ్యులేషన్ (2021)ను తీసుకురావడాన్ని అక్కడి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారు గత కొద్దీ రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ డ్రాఫ్ట్ ను వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అభివృద్ధి పేరుతో లక్షద్వీప్ ప్రజల ఆచార, వ్యవహారాలను అడ్డుకునేలా వ్యవహరిస్తున్నారని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు.
కాగా కొత్తగా తీసుకొచ్చిన డ్రాఫ్ట్ లో, బీఫ్ నిషేధం, మద్యపానానికి అనుమతి ఇచ్చారు. ఈ రెంటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అక్కడి ప్రజలు. ఇక ఇదిలా ఉంటే కొత్త డ్రాఫ్ట్ పై ఓ టీవీ చర్చలో మాట్లాడిన ఫిల్మ్ మేకర్, సామాజిక కార్యకర్త అయిషా సుల్తానాపై శుక్రవారం దేశ ద్రోహం కేసుతో పాటు మరో కేసు నమోదైంది. టీవీ చర్చలో అయిషా సుల్తానా విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటమే దేశ ద్రోహం కేసు నమోదుకు కారణంగా తెలుస్తుంది. కాగా చర్చలో అడ్మినిస్ట్రేటర్ పటేల్ తీసుకొచ్చిన డ్రాఫ్ట్ ను తీవ్రంగా వ్యతిరేకించారు.
లక్షద్వీప్ ప్రజలపై కేంద్ర ప్రభుత్వం కోవిడ్19ను జీవాయుధంగా వదిలినట్లు ఆరోపించారు. అంతే కాదు అడ్మినిస్ట్రేటర్ పటేల్ను ఆమె బయోవెపన్ అని సంబోధించారు. ఆమె వ్యాఖ్యలపై బీజేపీ యూనిట్ అధ్యక్షుడు సీ అబ్దుల్ ఖాదిర్ హజీ కావరట్టి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అబ్దుల్ ఖాదిర్ హజీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. సెడిషన్ సెక్షన్ 124ఏ కింద ఆమెపై కేసు ఫైల్ చేశారు.