Ashwini Vaishnaw : ఐటీ మంత్రి చేతుల్లోని పెగాసస్ స్టేట్మెంట్ లాక్కొని చించేసిన టీఎంసీ ఎంపీ
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో వరుసగా మూడో రోజు ఉభయసభల్లో(లోక్ సభ,రాజ్యసభ)గందరగోళం నెలకొంది.
Ashwini Vaishnaw పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో వరుసగా మూడో రోజు ఉభయసభల్లో(లోక్ సభ,రాజ్యసభ)గందరగోళం నెలకొంది. పెగాసస్ స్పైవేర్, మీడియా సంస్థలపై ఐటీ దాడులు సహా వివిధ ఇష్యూలపై విపక్ష ఎంపీలు ఉభయసభల్లో ఇవాళ కూడా ఆందోళనకు దిగారు. అయితే రాజ్యసభలో ఆగకుండా విపక్ష సభ్యుల నినాదాలు చేస్తుండటంతో ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బలవంతంగా తన ప్రసంగాన్ని వెంటనే ముగించాల్సి వచ్చింది.
అయితే పెగాసస్ స్పైవేర్ అంశంపై ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటన చేస్తున్న సమయంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అనుచితంగా వ్యవహరించారు. టీఎంసీ ఎంపీ శంతను సేన్.. మంత్రి వైష్ణవ్ చేతుల్లోని పేపర్లు లాక్కొని వాటిని చించి స్పీకర్ చైర్ వైపు వెదజల్లారు. దీంతో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి, ఎంపీ శంతను సేన్ మధ్య మాటల ఘర్షణ కొనసాగింది.
దీంతో సభలో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకే మార్షల్స్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఎంసీ ఎంపీ ప్రవర్తన తీరుని డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ఖండించారు. గందరగోళం నడుమ ఆయన సభను రేపటికి వాయిదా వేశారు. గతంలోనూ టీఎంసీ ఎంపీలు.. నూతన రైతు చట్టాలను ప్రవేశపెడుతున్న సమయంలో.. చైర్ మైక్ లాగేసిన విషయం తెలిసిందే.