బెంగాల్‌లో బీజేపీ ఎమ్మెల్యేలు రాజీనామా.. అధిష్ఠానం ఆదేశంతోనే!

బెంగాల్‌లో బీజేపీ ఎమ్మెల్యేలు రాజీనామా.. అధిష్ఠానం ఆదేశంతోనే!

Bjp

MPs resign as MLAs:  భారతీయ జనతా పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో రాజీనామా చేశారు. బీజేపీ అధిష్ఠానం ఆదేశాలతో ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసినట్టు వెల్లడించారు సర్కార్, ప్రమాణిక్. ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి ఎంపీలుగా కొనసాగాలని అధిష్ఠానం నిర్ణయించిందని వారు వెల్లడించారు.

అధిష్ఠానం నుంచి సమాధానం రాకపోవడంతో వీరు ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేయలేదు. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా ఇద్దరూ రాజీనామా చేశారు. ఆరు నెలల్లోగా వారు గెలిచిన దిన్‌హటా, శాంతిపూర్ నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు జరగనున్నాయి. ఈ ఇద్దరి రాజానామాలతో బెంగాల్ అసెంబ్లీలో బీజేపీ బలం 77 నుంచి 75కు పడిపోయింది.

ఈ మేరకు రాజీనామా పత్రాలను నిషిత్ ప్రమాణిక్, జనన్నాథ్ సర్కార్‌లు స్పీకర్ బిమన్ బెనర్జీకి అందజేశారు. ఈ ఇద్దరూ బీజేపీ ఎంపీలుగా ఉంటూనే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. రణఘాట్‌ నియోజవర్గానికి జగన్నాథ్ సర్కార్ ఎంపీగా ఉండగా, కూచ్‌బెహర్ నియోజకవర్గానికి ప్రమాణిక్ ఎంపీగా ఉన్నారు.

ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికలలో సర్కార్ శాంతిపూర్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలో నిలిచారు. సర్కార్ తన సమీప ప్రత్యర్థిపై 15,878 ఓట్ల తేడాతో శాంతిపూర్ సీటును గెలుచుకోగా, దిన్‌హటా నియోజకవర్గంలో ప్రమానిక్ టీఎంసీ అభ్యర్థిపై 57 ఓట్ల తేడాతో గెలుపొందారు.

కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో, లాకెట్ ఛటర్జీ, రాజ్యసభ మాజీ సభ్యుడు స్వాపన్ దాస్‌గుప్తా మరో ఇద్దరు లోక్‌సభ ఎంపీలను కూడా బీజేపీ అసెంబ్లీ బరిలో నిలబెట్టింది. కానీ వారంతా ఎన్నికల్లో ఓడిపోయారు. మొత్తం బెంగాల్ అసెంబ్లీలో 292 నియోజకవర్గాల్లో 213 స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది.