Uddhav Thackeray Resign : బలపరీక్షకు ముందే.. సీఎం పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం నేపథ్యంలో సీఎం పదవికి ఉద్దవ్ ఠాక్రే రాజీనామా చేశారు.
Uddhav Thackeray : మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం నేపథ్యంలో సీఎం పదవికి ఉద్దవ్ ఠాక్రే రాజీనామా చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీలో గురువారం (జూన్ 30) బలపరీక్ష జరగాల్సి ఉంది. మహా సంక్షోభంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిన కొద్దిసేపటికే ఉద్ధవ్ ఠాక్రే రాజ్ భవన్లో సీఎం పదవికి అధికారికంగా రాజీనామా చేశారు. బల పరీక్షపై స్టే విధించడం కుదరదని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిన తర్వాత ఆయన ఫేస్బుక్ లైవ్ వేదికగా మాట్లాడుతూ ఈ సంచలన ప్రకటన చేశారు. సుప్రీంకోర్టు తీర్పుని తాను గౌరవిస్తున్నట్లు ఉద్దవ్ తెలిపారు.
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్కు కూడా ఉద్ధవ్ కృతజ్ఞతలు తెలిపారు. శివసేన ప్రభుత్వానికి కొందరి దిష్టి తగిలిందన్నారు. ఇంతకీ ఆ దిష్టి ఎవరిదో అందరికీ తెలుసునని అన్నారు. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వం బాలాసాహెబ్ ఆశయాలు నెరవేర్చిందని చెప్పారు. సీఎం పదవితో పాటు ఎమ్మెల్సీ పదవికి సైతం రాజీనామా చేస్తున్నట్లు ఉద్దవ్ ఠాక్రే తెలిపారు. గురువారం ఉదయం 11 గంటలకు బలపరీక్ష జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.
తన రాజీనామాకు ముందు ఉద్దవ్ ఠాక్రే అధ్యక్షతన మహారాష్ట్ర కేబినెట్ భేటీ అయింది. మహాలో రెండు నగరాల పేర్లను మార్చుతూ కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఔరంగాబాద్ పేరును ఉస్మానాబాద్ పేరు ధారా శివ్, శంభాజీనగర్గా మార్చింది. నవీముంబై ఎయిర్పోర్టు పేరును డీబీ పాటిల్ ఎయిర్పోర్టుగా మార్చుతూ ఠాక్రే కేబినేట్ ఆమోదించింది. కేబినెట్ భేటీలో మంత్రులకు సీఎం ఉద్దవ్ ధన్యవాదాలు తెలిపారు. ఏమైనా తప్పు జరిగితే అందరూ తనను మన్నించాలని ఠాక్రే కోరారు. తన వాళ్లే తనను మోసం చేశారని, వెన్నుపోటు పొడిచి ఈ స్థితికి తీసుకొచ్చారని ఉద్వేగానికి లోనయ్యారు.
Read Also : Maharashtra: శివసేనకు షాక్.. రేపు మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు తీర్పు