నవంబర్-1 నుంచి డిగ్రీ, పీజీ క్లాస్ లు…వేసవి సెలవలు కట్
దేశవ్యాప్తంగా డిగ్రీ,పీజీ తొలి ఏడాది విద్యార్థులకు నవంబర్ 1 నుంచి క్లాసులు ప్రారంభం కానున్నాయి. కరోనా నేపథ్యంలో విద్యా సంవత్సరం క్యాలెండర్ కు సంబంధించి నిపుణుల కమిటీ రూపొందించిన మార్గదర్శకాలను యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్(యూజీసీ) ఆమోదించింది.
కరోనా కారణంగా కోల్పోయిన సమయాన్ని భర్తీ చేయడానికి వేసవి, శీతాకాల సెలవులను కుదించాలని కూడా నిర్ణయం తీసుకుంది. నియంత్రణలో లేని కారణాల వల్ల ఈ విద్యా సంవత్సరానికి నష్టం వాటిల్లిందని యూజీసీ పేర్కొంది. వేసవి, శీతాకాల సెలవులను తగ్గించడం వల్ల మూడేళ్ల యూజీ/పీజీ కోర్సుల విద్యార్థులు సకాలంలో తమ కోర్సు పూర్తి చేసుకోగలుగుతారని తెలిపింది.
డిగ్రీ, పీజీ తొలి ఏడాది విద్యార్థుల కోసం తయారు చేసిన నిబంధనలను యూజీసీ ఆమోదించినట్లు విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ట్వీట్ చేశారు. వాస్తవానికి, కాలేజీల పునఃప్రారంభం కోసం యూజీసీ… ప్రత్నామ్నాయ అకాడమిక్ క్యాలెండర్ను ఏప్రిల్ 29నే విడుదల చేసింది. సెప్టెంబర్ నుంచి కళాశాలలను తెరవాలని సూచించింది. అయితే కరోనా తీవ్రత పెరుగుతుండటం వల్ల ఈ ప్రణాళిక కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో తాజా మార్గదర్శకాలు రూపొందించింది.
సవరించిన మార్గదర్శకాలు
– అక్టోబర్- 31 నాటికి తొలి సంవత్సరం విద్యార్థుల అడ్మిషన్ ప్రక్రియ పూర్తి.
– తొలి సెమిస్టర్ క్లాసులు నవంబర్- 1 నుంచి ప్రారంభం.
– వేసవి, శీతాకాల సెలవులను తగ్గించాలి.
– ఈ ఏడాది విద్యార్థులు సకాలంలో డిగ్రీ పట్టా పొందేలా వచ్చే ఏడాది విద్యా సంవత్సరాన్ని త్వరగా ప్రారంభించాలి.
– ప్రస్తుత బ్యాచ్ విద్యార్థులకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి 2020-21, 2021-22 విద్యా సంవత్సరాలలో వారానికి ఆరు రోజుల ప్రణాళికను యూనివర్సిటీలు అమలు చేయాలి.
అంతేకాకుండా, ఈ ఏడాది విద్యా సంవత్సరానికి సంబంధించి నవంబర్ 30 వరకు యూనివర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్యాడ్యుయేట్ కోర్సుల్లో తొలి ఏడాది అడ్మిషన్లు రద్దు చేసుకున్న, వలస వెళ్లిన విద్యార్థులకు ఫీజులు తిరిగి చెల్లిస్తారని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ చెప్పారు. కరోనా నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులపై మరింత భారం పడకూడదన్న ఉద్దేశంతో ఈ ఒక్కసారికి ప్రత్యేకంగా ఈ మేరకు అవకాశం కల్పించినట్లు చెప్పారు.