మోడీ పేరు మీద ఓట్లు వేయరు…ఉత్తరాఖండ్ బీజేపీ చీఫ్ కీలక వ్యాఖ్యలు

  • Published By: venkaiahnaidu ,Published On : August 28, 2020 / 04:58 PM IST
మోడీ పేరు మీద ఓట్లు వేయరు…ఉత్తరాఖండ్ బీజేపీ చీఫ్ కీలక వ్యాఖ్యలు

కేంద్రంలోనే కాదు.. రాష్ట్రాల్లోని బీజేపీ నేతలు సైతం ప్రధాని మోడీని, ఆయన చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు తమకు ఓట్లు వేస్తారని చెబుతుంటారు. ఆయన వల్లే తమకు గెలుపు లభిస్తుందని ఎక్కువమంది బీజేపీ నాయకులు నమ్ముతుంటారు. కానీ ఉత్త‌రాఖండ్ బీజేపీ అధ్య‌క్షుడు మాత్రం ఇందుకు భిన్న‌మైన వ్యాఖ్య‌లు చేశారు.

ఉత్తరాఖండ్‌లో 2022లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మోడీని చూసి ఓట్లు వేస్తారని అనుకోవద్దని ఉత్త‌రాఖండ్ బీజేపీ అధ్య‌క్షుడు బన్సీధార్ భగత్ పార్టీ ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మోడీ పాపులారిటీని చూపించి బీజేపీ ఎమ్మెల్యేలు విజ‌యం సాధించ‌లేర‌న్నారు.

మోడీని చూసిన జనం ఓట్లు వేస్తారని ఎవరైనా అనుకుంటే అది తప్పే అవుతుందని భగత్ తెలిపారు. ఎమ్మెల్యేలు ప‌ని చేస్తేనే ప్ర‌జ‌లు ఓట్లు వేస్తార‌ని బన్సీధార్ భగత్ వ్యాఖ్యానించారు. ప్ర‌జ‌లు ఇదివ‌ర‌కే మోడీ ముఖం చూసి ఓట్లు వేశార‌ని, కాబ‌ట్టి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆ ప‌రిస్థితి ఉండ‌బోద‌ని చెప్పారు.

అయితే భగత్ వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ తనదైన శైలిలో స్పందించింది. మోడీ హ‌వా త‌గ్గింద‌ని ఒప్పుకుంటున్న బ‌న్‌సిందార్ వ్యాఖ్య‌ల‌ను స్వాతిస్తున్నామ‌ని తెలిపింది. మోడీ హ‌వా తగ్గిపోవ‌డం వ‌ల్లే ఆయ‌న ‌త‌న ఎమ్మెల్యేల‌కు వ్య‌క్తిగ‌త ప్ర‌ద‌ర్శ‌న మెరుగుప‌ర్చుకోమ‌ని సూచించార‌ని ఆ రాష్ట్ర‌ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ సూర్య‌కాంత్ ధ‌స్మానా అన్నారు.